రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు... ఈ జిల్లాలకు హెచ్చరిక
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు ఇప్పటికే అతలాకుతలం సృష్టించగా ఆదివారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుందన్న వాతావరణ ప్రకటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
హైదరాబాద్: ఇప్పటికే భారీ వర్షాలతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతకొద్ది రోజులగా కురుస్తున్న వర్షాలతో రాజధాని హైదరాబాద్ తో సహా రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలు, గ్రామాలు నీటమునిగాయి. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు గంటల్లో రాష్ట్రంలోని సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, వనపర్తి, రంగారెడ్డి, మేడ్చల్ తో పాటు హైదరాబాద్ జిల్లాలో రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. మిగతా జిల్లాలో మోస్తరు నుండి సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపారు.
ఇక మూడు రోజుల క్రితం భారీ కురిసిన కుండపోత వానకు హైదరాబాద్ అతలాకుతలం కాగా తాజాగా గత రాత్రి కురిసిన వర్షానికి మరోసారి నగరం నీటమునిగింది.ద్ చాంద్రాయణగుట్ట రక్షపురం కాలనీలో అర్ధరాత్రి ఇళ్లల్లోకి నీరు చేరాయి. నడుములోతుకు నీరు చేరడంతో అర్ధరాత్రి బిల్డింగ్ లపైకి ఎక్కి ప్రజలు ప్రాణాలు కాపాడుకున్నారు. బలపురం చెరువు నిండుకుండలా మారడంతో కాలనీలోకి నీరు వచ్చి చేరుతోంది.
బండ్లగూడ నుండి నాగోలు చౌరస్తా వరకు రోడ్ల మీద వరద నీరు చేరింది. దీంతో వాహనాలు బారులు తీరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో అక్కడికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజా వర్షాలతో నగరంమీదుగా ప్రవహంచే మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుండగా, నగర నడిబొడ్డున గల హుస్సెన్ సాగర్ నిండుకుండలా మారింది. అలాగే లోతట్టు ప్రాంతాలు జలయమయ్యాయి. నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు.