గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు: పోటీలో ఉన్న టీఆర్ఎస్ నేతలు వీరే, సీటు ఎవరికో...
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.ఈ రెండు స్థానాలను కైవసం చేసుకోవాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు కోసం అధికార టీఆర్ఎస్ లో పలువురు నేతలు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఈ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల కోసం టీఆర్ఎస్ నాయకత్వం ఇప్పటినుండే వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది.
నల్గొండ-ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి ప్రస్తుత ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపనుంది.హైద్రాబాద్-రంగారెడ్డి-మహాబూబ్నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి పోటీకి పలువురు ఆసక్తిగా ఉన్నారు.
ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29వ తేదీన ముగియనుంది. ఈ నెల 18వ తేదీన నల్గొండ-ఖమ్మం- వరంగల్ స్థానానికి చెందిన ఓటరు జాబితా, ఈ నెల 22న హైద్రాబాద్-రంగారెడ్డి-మహాబూబ్నగర్ స్థానానికి చెందిన ఓటరు జాబితా విడుదల కానుంది.
నల్గొండ ఎమ్మెల్సీ స్థానంలో ఇప్పటికే 5 లక్షలు, హైద్రాబాద్ స్థానంలో సుమారు 4.48 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకొన్నారు.
హైద్రాబాద్-రంగారెడ్డి-మహాబూబ్నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నుండి పలువురు ఆశావాహులు ఆసక్తిగా ఉన్నారు.జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, పీఎల్ శ్రీనివాస్, శుభప్రద్ పటేల్, వర్కటం జగన్నాథ్ రెడ్డి తో పాటు నాగేందర్ గౌడ్ లు టీఆర్ఎస్ నుండి పోటీకి ఆసక్తిగా ఉన్నారు. ఈ స్థానం నుండి ఎవరిని టీఆర్ఎస్ పోటీకి దింపుతోందోననే సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ బరిలోకి దిగుతున్నాడు. గతంలో ఇదే స్థానం నుండి ఆయన రెండు దఫాలు ప్రాతినిథ్యం వహించాడు. మరోసారి ఆయన బరిలోకి దిగుతున్నాడు. ప్రోఫెసర్ నాగేశ్వర్ కు సీపీఎం మద్దతు ప్రకటించింది.
2007,2009, 2015లలో ఈ స్థానానికి ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో ఏనాడూ కూడ టీఆర్ఎస్ విజయం సాధించలేదు. దీంతో ఈ స్థానంలో ఈ దఫా విజయం సాధించాలని టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
పట్టభద్రులు, ఉద్యోగులను ఆకర్షించేందుకు ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ వరాలు కురిపించారు. ఉద్యోగుల వేతనాల పెంపుతో పాటు రిటైర్మెంట్ వయస్సును పెంచుతామని ప్రకటించారు.
నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలను పురస్కరించుకొనే ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేయాలని పూనుకొందని విపక్షాలు విమర్శలు గుప్తిస్తున్నాయి.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి టీజేఎస్ చీఫ్ కోదండరామ్ బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడ ఈ స్థానం నుండి అభ్యర్ధిని బరిలోకి దింపనుంది. ఈ స్థానంలో ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇంచార్జీని టీఆర్ఎస్ నియమించింది.
నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డికి సూచించారు. ఈ స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డిని టీఆర్ఎస్ బరిలోకి దింపింది.