- Home
- Telangana
- High Court: 100 ఎకరాల్లో రూ. 1500 కోట్లతో... హైదరాబాద్లో మరో ఐకానిక్ భవనం. పూర్తైన భూమి పూజ
High Court: 100 ఎకరాల్లో రూ. 1500 కోట్లతో... హైదరాబాద్లో మరో ఐకానిక్ భవనం. పూర్తైన భూమి పూజ
High Court: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మరో ఐకానిక్ భవనానికి శ్రీకారం పడింది. 100 ఎకరాల్లో ఏకంగా రూ. 1500 కోట్లతో నిర్మించనున్న ఈ బిల్డింగ్కు బుధవారం భూమి పూజ చేశారు. ఈ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం.

తెలంగాణ హైకోర్టుకు నూతన భవనం
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కొత్త భవన నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా బుద్వేలులో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపడుతున్నారు. బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ భూమి పూజ చేసి నూతన ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్పై ప్రభుత్వం సుమారు రూ.1,550 కోట్లు ఖర్చు చేయనుంది.
మూడేళ్లలో పూర్తి చేయడమే లక్ష్యం
హైకోర్టు కొత్త భవన నిర్మాణ పనులు డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ కంపెనీకి అప్పగించారు. సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, రాబోయే మూడు సంవత్సరాల్లో నిర్మాణ పనులను పూర్తిచేయనున్నారు. నిర్మాణం పూర్తయ్యాక న్యాయ వ్యవస్థకు ఆధునిక సదుపాయాలు లభిస్తాయని అంటున్నారు.
6 అంతస్తుల్లో
నూతన భవన నిర్మాణ శైలి ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీని తలపించేలా ఉంటుంది. మొత్తం 6 అంతస్తులలో ప్రధాన కోర్టు భవనం, 60 మంది జడ్జిలకు సరిపడే కోర్టు హాళ్లు, నివాస గృహాలు, పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం హైకోర్టులో 42 మంది జడ్జి పోస్టులు ఉండగా, భవిష్యత్తులో నియామకాలు పెరిగినా ఇబ్బంది లేకుండా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ప్రజల కోసం ప్రత్యేక సదుపాయాలు
కోర్టుకు వచ్చే ప్రజల కోసం కొత్త భవనంలో ప్రత్యేక స్థలాలను కేటాయిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మరో రెండు అంతస్తులు ప్రజల అవసరాలకు వినియోగించుకోనున్నారు. క్యాంటీన్, టాయిలెట్లు వంటి సౌకర్యాలను కూడా కల్పించనున్నారు. పార్కింగ్ సమస్యను పరిష్కరించేందుకు 4,000 టూవీలర్స్, 2,000 కార్లను ఒకేసారి పార్క్ చేసేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందించారు.
పచ్చదనంతో కూడిన ఆధునిక నిర్మాణం
కొత్త హైకోర్టు భవన సముదాయం మొత్తం 40 వేర్వేరు నిర్మాణాలతో రూపుదిద్దుకోనుంది. చుట్టుపక్కల పచ్చిక బయళ్లు, పూల తోటలు, చెట్లతో పచ్చదనాన్ని పెంపొందించనున్నారు. ఇది న్యాయ వ్యవస్థలో తెలంగాణకు ఒక కొత్త మైలురాయిగా నిలవనుంది.