స్వయంగా కల్లు గీసి తాగుతూ... గీతకార్మికుడి అవతారమెత్తిన ఆబ్కారి మంత్రి శ్రీనివాస్ గౌడ్
గురువారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామంలో పర్యటించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈత, తాటి వనాలలో పనచేస్తున్న గీత కార్మికులను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
జగిత్యాల: తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గీత కార్మికుడిగా మారారు. గురువారం జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెంపేట్ గ్రామంలో పర్యటించిన మంత్రి ఈత, తాటి వనాలలో పని చేస్తున్న గీత కార్మికులను కలిసి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మంత్రి స్వయంగా ఈత చెట్టుకు నీరాను గీసి తాగారు. ఇలా గీత కార్మికులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రోత్సహించారు.
అనంతరం గీత కార్మికులు ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తున్నారన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో సుమారు 4 కోట్ల తాటి, ఈత మొక్కలను నాటి గీత వృత్తి, కార్మికులకు సీఎం ప్రోత్సహం అందించారన్నారు.
గీత కార్మికుల సంక్షేమం కోసం వృత్తి పన్నును, బకాయిలను పూర్తిగా రద్దుచేసామని గుర్తుచేశారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి మరణిస్తే వారికి రూ.2 లక్షల రూపాయల నుండి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ను పెంచామన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీ ని తీసుకవస్తున్నామన్నారు. గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కి సీఎం కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
అనంతరం జిల్లా ఆబ్కారీ శాఖ అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ విధివిధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు మన్నే శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆబ్కారీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శాస్త్రి, జిల్లా అధికారులు శ్రీధర్, చంద్రశేఖర్, ఆబ్కారీ శాఖ సీఐ, ఎస్సై లు వారి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.