Telangana: వాహనదారులకు బిగ్ అలర్ట్....మూడు రోజుల పాటు ఆ ప్రాంతాల వైపు వెళ్లొద్దు!
సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగా జూలై 13-15 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు వాడాలని పోలీసుల విజ్ఞప్తి చేస్తున్నారు.

ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ వాసులకు ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రాంతానికి వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. జులై 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఆంక్షల కారణంగా సాధారణ రవాణాలో అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున, ప్రయాణం ముందుగానే ప్లాన్ చేసుకోవాలని హెచ్చరించారు.
బోనాల ఉత్సవాలు
ఈ ఆంక్షల వెనుక ఉన్న ముఖ్యమైన కారణం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు. ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ పండుగకు విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతాయి. జూలై 13న ఆదివారం రోజు ప్రధాన బోనం సమర్పణ కార్యక్రమం, జూలై 14న సోమవారం రంగం వేడుక, అనంతరం జూలై 15వ తేదీ వరకు బోనాల కార్యక్రమాలు కొనసాగుతాయి.
భక్తుల రద్దీ
ఈ కార్యక్రమాలకు హాజరయ్యే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రత్యేకించి సికింద్రాబాద్ మహంకాళి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడు రోజులపాటు వాహన రాకపోకలకు తాత్కాలిక ఆంక్షలు అమలులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతాల్లోకి వాహనాల ప్రవేశాన్ని నియంత్రించనున్నట్టు తెలిపారు.
ట్రాఫిక్ నియమాలు
పోలీసులు సూచించిన మార్గాల ప్రకారం ప్రయాణిస్తే ట్రాఫిక్ సమస్యలు ఎదురుకావన్న అవకాశమే తక్కువ. అలా కాకుండా ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా బస్సులు, ఆటోలు, రెండు చక్రాల వాహనాలు కూడా అధికారులు సూచించిన దారుల నుంచే వెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు
ఈ సందర్భంగా ట్రాఫిక్ మళ్లింపు మార్గాల వివరాలను కూడా పోలీసులు త్వరలో విడుదల చేయనున్నారు. నగరంలోని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ దారులు మార్చబడి, వాటిపై సహాయక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. అంతేగాక, ట్రాఫిక్ సిబ్బంది కూడా అక్కడే మోహరించి ప్రజలకు సహాయం అందించనున్నారు. వాటిని పాటించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
పోలీసులకు సహకరిస్తే
ఇక ఈ వేడుకల్లో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి స్వయంగా బోనం సమర్పించనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ తరఫున కలెక్టర్, దేవాదాయ శాఖ, జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. వాహనదారులు కూడా పోలీసులకు సహకరిస్తే వేడుకలు మరింత సజావుగా జరుగుతాయని మంత్రి చెప్పారు.
రాష్ట్రం శాంతియుతంగా
బోనాల ఉత్సవాల ప్రాముఖ్యతను తెలియజేస్తూ మంత్రి మాట్లాడుతూ, లష్కర్ బోనాలకు వందల ఏళ్ల చరిత్ర ఉందని చెప్పారు. తెలంగాణ సంస్కృతిలో ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని, ఆమె ఆశీర్వాదంతో రాష్ట్రం శాంతియుతంగా ఉండాలని ఆకాంక్షించారు.ట్రాఫిక్ ఆంక్షల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు ముందుగానే హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు సహా ప్రతీ ఒక్కరు తమ ప్రయాణాలను తగిన విధంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో ట్రాఫిక్ అధికంగా ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
అత్యవసర వాహనాలకు
ఇక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అత్యవసర సేవలైన అంబులెన్స్లు, ఫైర్ ఇంజన్లు, ఇతర అత్యవసర వాహనాలకు మాత్రం అనుమతులు ఉండనున్నాయి. వాటికి ప్రత్యేక మార్గాలు కూడా ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ట్రాఫిక్ పోలీసుల సహకారంతో ఈ మార్గాలను క్షణక్షణానికి మానిటర్ చేయనున్నారు.పండుగ సందర్భంగా సీసీ టీవీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ప్రజల రక్షణకు సంబంధించి ఏ చిన్న అనుమానాస్పద చర్య కనిపించినా వెంటనే చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ట్రాఫిక్ సమస్యలు ఎదురుకాకుండా ప్రత్యేక హెల్ప్డెస్క్లు కూడా ఏర్పాటు చేశారు.