- Home
- Telangana
- బలపడుతోన్న వాయుగుండం.. వచ్చే 3 రోజులు అల్లకల్లోలమే, ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు
బలపడుతోన్న వాయుగుండం.. వచ్చే 3 రోజులు అల్లకల్లోలమే, ఈ ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు
Rain Alert: వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడడం కారణం వర్షాలు కురుస్తాయని అంటున్నారు.

బలపడుతోన్న వాయుగుండం
నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఏర్పడిన అల్పపీడనం గురువారం మధ్యాహ్నం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల దిశగా కదిలే అవకాశం ఉంది. ఆపై మరింత బలపడే అవకాశం ఉండడంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు, గాలుల ప్రభావం కనిపించే అవకాశం ఉందని హెచ్చరించారు.
తెలంగాణలో నాలుగు రోజుల వర్షాలు – ఎల్లో అలెర్ట్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బుధవారం: ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయి.
గురువారం: కొత్తగూడెం, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ సహా 20 జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శుక్రవారం, శనివారం: వికారాబాద్, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. వర్షాల సమయంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు కూడా ఉండవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది.
ఆంధ్రప్రదేశ్ తీరానికి వాయుగుండం ముప్పు
ఉత్తర శ్రీలంక సమీపంలో ఏర్పడిన ఈ అల్పపీడనం గురువారం మధ్యాహ్నం నాటికి బలమైన వాయుగుండంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు–దక్షిణ ఆంధ్ర తీరాల వైపు చేరవచ్చని అంచనా. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 30–45 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలెర్ట్, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, పల్నాడు జిల్లాకు ఎల్లో అలెర్ట్లు జారీ చేశారు.
ఏపీలో భారీ వర్షాలు
మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. శ్రీకాళహస్తిలో 19 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, కడప జిల్లాల్లో 10 సెం.మీ.కు పైగా వర్షం పడింది. మర్రిపాడు (నెల్లూరు)లో 8.8 సెం.మీ. వర్షపాతం నమోదవగా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
సిద్దంగా ఉన్న విపత్తు నిర్వహణ బృందాలు
వాయుగుండం ప్రభావం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు చర్యలు చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకారం, అత్యవసర సహాయక చర్యల కోసం 1 NDRF, 4 SDRF బృందాలను ప్రభావిత జిల్లాలకు పంపారు. మత్స్యకారులు శనివారం వరకు సముద్రంలోకి వెళ్లరాదు అని హెచ్చరించారు. తీరప్రాంతాల్లోని ప్రజలు గాలులు, ఉరుములు, మెరుపులు కొనసాగినప్పుడు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.