వెలుగు చూసిన నిజం: కల్వకుంట్ల కవిత ఓటమికి ప్రశాంత్ కిశోర్ ప్లాన్
హైదరాబాద్: నిజామాబాద్ లోకసభ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా కారణమనే విషయం తాజాగా వెలుగు చూసింది. కవితను ఓడించడానికి ప్రశాంత్ కిశోర్ జట్టు పనిచేసినట్లు చెబుతున్నారు.
హైదరాబాద్: నిజామాబాద్ లోకసభ స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె చంద్రశేఖర రావు కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా కారణమనే విషయం తాజాగా వెలుగు చూసింది. కవితను ఓడించడానికి ప్రశాంత్ కిశోర్ జట్టు పనిచేసినట్లు చెబుతున్నారు
నిజామాబాద్ లోకసభ స్థానంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ తనయుడు అరవింద్ బిజెపి తరఫున పోటీ చేసి కవితను ఓడించిన విషయం తెలిసిందే. కవిత ఓటమికి ఇప్పటి వరకు పలు కారణాలు చెబుతూ వచ్చారు. వాటిలో పసుపు రైతుల నామినేషన్లు కూడా ఓ కారణంగా చెబుతూ వస్తున్నారు.
కవిత ఓటమికి కాంగ్రెసు కారణమని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నారు. కాంగ్రెసు, బిజెపి కుమ్మక్కు కావడం వల్ల కవిత ఓడిపోయినట్లు ఆయన తేల్చారు. నిజానికి, కాంగ్రెసు అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ అతి తక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెసు ఓట్లు కవితకు కాకుండా బిజెపి అభ్యర్థి అరవింద్ కు పడ్డాయని అంచనా వేశారు. దానివల్ల అరవింద్ విజయం సాధించారు.
అయితే, నిజామాబాద్ లోకసభ స్థానం విషయంలో కవిత లేదా టిఆర్ఎస్ వ్యూహం పూర్తిగా దెబ్బ తింది. నిజామాబాద్ లోకసభ స్థానంలో తమకు ప్రధాన ప్రత్యర్థిగా భావించిన కాంగ్రెసును కవిత పూర్తిగా బలహీనపరిచారు. అదే సమయంలో బిజెపిని చాలా తక్కువ అంచనా వేశారు. దానివల్ల బిజెపి ఓట్లు పొల్లుపోకుండా అరవింద్ కు పడడమే కాకుండా కాంగ్రెసు ఓట్లు కవిత భావించినట్లు తనకు కాకుండా అరవింద్ కు పడ్డాయి. ఇది ప్రధానంగా కవిత ఓటమికి కారణమని చెప్పవచ్చు.
అయితే, అరవింద్ విజయానికి మొత్తం వ్యూహరచన చేసిన అమలు చేసింది మాత్రం ప్రశాంత్ కిశోర్ జట్టు. ప్రశాంత్ కిశోర్ సాధారణంగా ఒక్క అభ్యర్థి కోసం, ఒక్క నియోజకవర్గానికి పరిమితమై పనిచేయరు. రాష్ట్రవ్యాప్తంగా ఓ పార్టీకి ఆయన పనిచేస్తూ వస్తున్నారు. అయితే, అసాధారణమైన పరిస్థితిలో ప్రశాంత్ కిశోర్ నిజామాబాద్ నియోజకవర్గంలో తన జట్టును దింపారని అంటున్నారు.
నిజానికి, లోకసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేయాల్సి ఉండింది. ఈ విషయమై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు, ప్రశాంత్ కిశోర్ కు మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే, ఇరువురి మధ్య చర్చల్లో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రశాంత్ కిశోర్ వెనక్కి తగ్గారు.
అయితే, ప్రశాంత్ కిశోర్ ఐ క్యాప్ జట్టు అనధికారికంగా నిజామాబాద్ లోకసభ నియోజకవర్గంలో అరవింద్ కోసం పనిచేసిందని సమాచారం. కొంత మంది బిజెపి అగ్రనేతల ప్రోద్బలంతో ఆయన అనధికారికంగా దాదాపు 20 మంది తన టీం సభ్యులను అరవింద్ కోసం నిజామాబాద్ లోకసభ స్థానంలో దించారని చెబుతున్నారు. అరవింద్ కోసం ఆ జట్టు నిరంతరాయంగా పనిచేసినట్లు, అందులో భాగంగానే అరవింద్ విజయం సాధించి, కవిత ఓడిపోయినట్లు తాజాగా ప్రచారం సాగుతోంది