కేటీఆర్ తో సీక్రెట్ భేటీ: ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఇదీ...
జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుతో సమావేశమైనట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా ఆయన కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. చాలా రోజుల క్రితం ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్, కుమార స్వామి వంటి నేతలను కలిశారు కూడా. అయితే, వివిధ కారణాల వల్ల తన ప్రయత్నాలను ఆయన ఆపేశారు.
టీఆర్ఎస్ తెలంగాణలో బిజెపిని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెసు ఖతమైందని, తమకు ప్రధాన ప్రత్యర్థి బిజెపినే అవుతుందని అనుకుంటోంది. ఈ స్థితిలో తన వేదికలో లేదా కూటమిలో టీఆర్ఎస్ ను భాగస్వామిని చేయడానికే ప్రశాంత్ కిశోర్ రిషితో కలిసి కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది.
రిషి ప్రశాంత్ కిశోర్ జట్టులో కీలకమైన సభ్యుడు. రిషి పెళ్లి రిసెప్షన్ కు వైఎస్ జగన్ తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. ఈ స్థితిలో ప్రశాంత్ కిశోర్ తో జగన్ బంధం కొనసాగుతుందని చెప్పవచ్చు. నిజానికి, వైఎస్ జగన్ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ ప్రశాంత్ కిశోర్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేరనేది స్పష్టం. ఎన్నికల్లో జగన్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.
ప్రశాంత్ కిశోర్ దేశవ్యాప్తంగా పలు బిజెపి వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేస్తున్నారు తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకె, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలకు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.
కర్ణాటకలో కుమారస్వామిని కూడా ప్రశాంత్ కిశోర్ తన కూటమిలో చేర్చుకునే అవకాశం ఉంది. ప్రశాంత్ కిశోర్ జట్టు మాజీ సభ్యుడు రాబిన్ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. కేసీఆర్, చంద్రబాబు చెప్తే కుమారస్వామి వినే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాతీయ స్థాయిలో బలమైన సమాఖ్యను ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసి ప్రశాంత్ కిశోర్ అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
jagan-kcr