- Home
- Telangana
- నో ట్రాఫిక్ టెన్షన్, ఇక ప్రశాంతంగా వెళ్లొచ్చు.. హైదరాబాద్లో 2 కొత్త ఫ్లై ఓవర్లు వచ్చేస్తున్నాయి. ఎక్కడంటే
నో ట్రాఫిక్ టెన్షన్, ఇక ప్రశాంతంగా వెళ్లొచ్చు.. హైదరాబాద్లో 2 కొత్త ఫ్లై ఓవర్లు వచ్చేస్తున్నాయి. ఎక్కడంటే
Hyderabad: ఎన్ని ఫ్లై ఓవర్లు వచ్చినా హైదరాబాద్లో ట్రాఫిక్ ఇబ్బంది ఉంటూనే ఉంది. అయితే తాజాగా నగరంలో మరో రెండు కొత్త ఫ్లై ఓవర్లను నిర్మించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

రేతిబౌలి–నానల్ నగర్ ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
హైదరాబాద్లో ప్రతిరోజూ రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల మీదుగా ప్రయాణించే వాహనదారులు తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ రూట్ ద్వారా ముంబై, కర్ణాటకతో పాటు వికారాబాద్, చేవేళ్ల, శంకర్ పల్లి, గచ్చిబౌలి వైపు వాహనాల రాకపోకలు ఎక్కువగా జరుగుతుండడంతో కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా బల్దియా భారీ స్థాయి రహదారి ప్రాజెక్ట్లు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
రూ. 398 కోట్లతో మల్టీ లెవల్ ఫ్లైఓవర్ ప్రాజెక్ట్
జీహెచ్ఎంసీ తాజాగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ముందు నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్వేకు సమాంతరంగా మల్టీ లెవల్ ఫ్లైఓవర్, గ్రేడ్ సెపరేటర్లను నిర్మించనుంది. మొత్తం రూ. 398 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. సెప్టెంబర్ 1 నుంచి 22 వరకు టెండర్లను స్వీకరించనుండగా, ఈ నెల 8న ప్రీ–బిడ్ మీటింగ్ జరగనుంది.
రేతిబౌలి–నానల్ నగర్లో కొత్త కనెక్టివిటీ
మెహిదీపట్నం బసంతర్ హౌస్ వద్ద జలమండలి ఫిల్టర్ బెడ్ నుంచి ప్రారంభమయ్యే ఫ్లైఓవర్ రేతిబౌలి జంక్షన్ వద్ద అత్తాపూర్ వైపు ర్యాంప్తో కలుస్తుంది. అక్కడి నుంచి నానల్ నగర్ మీదుగా టోలీచౌకి ఫ్లైఓవర్కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ నిర్మాణం కొనసాగుతుంది. అలాగే, నానల్ నగర్ నుంచి లంగర్ హౌజ్ వైపు వెళ్లే వాహనాల కోసం ఆలివ్ హాస్పిటల్ దగ్గర ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేయనున్నారు.
రెండు లైన్ల ఫ్లైఓవర్ ప్రత్యేకత
ఈ ప్రాజెక్ట్లో రెండు లైన్లతో కూడిన ఫ్లైఓవర్ను నిర్మించనున్నారు. దీని ద్వారా టోలీచౌకి, అత్తాపూర్, లంగర్ హౌజ్ వైపు వాహనాలు సిగ్నల్ వద్ద నిలిచిపోకుండా నేరుగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. మెహిదీపట్నం ప్రాంతంలో రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న కొంత భూమిని ఈ పనుల కోసం సేకరించేందుకు జీహెచ్ఎంసీ ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించింది.
రోడ్ నెంబర్ 12 నుంచి మరో ఫ్లైఓవర్
ప్రస్తుతం బంజారాహిల్స్ నుంచి మెహిదీపట్నం మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్, ముంబై నేషనల్ హైవే వైపు వెళ్లే వాహనాలు సరోజినీదేవి ఆసుపత్రి, మెహిదీపట్నం రైతు బజార్, రేతిబౌలి, నానల్ నగర్ మీదుగా ప్రయాణిస్తున్నాయి. ఈ దారిలో ట్రాఫిక్ తీవ్రంగా పెరగడంతో, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి అహ్మద్నగర్, పోచమ్మ బస్తీ మీదుగా హుమాయున్నగర్ మెయిన్ రోడ్డుకు చేరే కొత్త ఫ్లైఓవర్ ప్రతిపాదనను కూడా బల్దియా సిద్ధం చేసింది. ఇది భవిష్యత్తులో ఫిల్టర్ బెడ్ వద్ద ప్రారంభమయ్యే ఫ్లైఓవర్తో అనుసంధానమవుతుంది.
స్థల సేకరణలో జీహెచ్ఎంసీ
ఈ రెండు ఫ్లైఓవర్ల కోసం అవసరమైన భూముల సేకరణపై జీహెచ్ఎంసీ చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా రక్షణ శాఖ, స్థానిక స్థల యజమానులతో చర్చలు జరుగుతున్నాయి. పనులు పూర్తి అయితే రేతిబౌలి–నానల్ నగర్ ప్రాంతం సిగ్నల్ రహితంగా మారి, ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది.