లుంగీ బనియన్ తోనే... సీఎం కేసిఆర్ బసచేసిన తండాలో మంత్రి, ఎమ్మెల్యే
హనుమాన్ (తార్ సింగ్ బాయి తండా) తండాలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పల్లె నిద్ర చేపట్టారు.
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం హనుమాన్ (తార్ సింగ్ బాయి తండా) తండాలో మంగళవారం రాత్రి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పల్లె నిద్ర చేపట్టారు. స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి తండా వాసుల మధ్య గుగులోత్ జగన్ ఇంటిలో మంత్రి, ఎమ్మెల్యే బస చేశారు. జగన్ కుటుంబ సభ్యులు మంత్రి, ఎమ్మెల్యేలకు ఘనంగా స్వాగతం పలికారు.
తండా వాసుల సంప్రదాయ జొన్న రొట్టెలు, ఆకు కూరలు, నాటు కోడి, అన్నం వంటి రకరకాల వంటకాలను మంత్రికి తండా వాసులు వడ్డించారు. ఉద్యమ సమయంలో ఇప్పటి సీఎం కెసిఆర్ బస చేసింది ఎక్కడ? తండా వాసుల సమస్యలేంటి? ఏమేమి చేస్తున్నారు? కుటుంబ సభ్యుల వివరాలు ఏమిటి? వంటి కుశల ప్రశ్నలు వేస్తూ తండా వాసులతో కలిసి మమేకమయ్యారు మంత్రి, ఎమ్మెల్యే. ఇలా తండావాసులతో కలిసి రాత్రి అక్కడే నిద్రపోయారు.
బుధవారం తెల్లవారు జాము నుంచి 8.30 గంటల వరకు హనుమాన్ తండాలో మంత్రి ఎర్రబెల్లి మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ లతో కలిసి విస్తృతంగా పర్యటించారు. వేప పుల్లతో పళ్ళు తోముకుని, గ్రామంలో బయట ముఖం కడుక్కున్నారు. ప్రజలను పరామర్శించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెన్షన్లు వస్తున్నాయా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా? గ్రామంలో మంచినీటి సరఫరా, అంతర్గత రోడ్లు, డ్రైనేజీల పరిస్థితి ఏంటి? ఇంకా పరిష్కారం కాని సమస్యలేంటి? వంటి అంశాలపై మంత్రి ఆరా తీశారు. స్థానికులతో కలిసి సైకిల్ మోటార్లపై మంత్రి రెండు గ్రామ పంచాయతీలుగా విడిపోయిన జామతండా, హనుమాన్ తండాల పరిధిలోకి వచ్చే చుట్టుముట్టు తండాలను కలియ తిరిగారు.
అలాగే సిఎం కేసిఆర్ జన్మదినం సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా తాను పల్లె నిద్ర చేసిన హనుమాన్ తండాలో ప్రజలందరి తో కలిసి వందలాది మొక్కలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నాటారు. తండాలోని పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, డంపింగ్ యార్డు, నర్సరీలను సందర్శించారు. వాటి నిర్మాణాలు బాగున్నాయని అభినందించారు.
ఆతర్వాత ఆల్పాహారం చేసిన మంత్రి, అక్కడకు వచ్చిన మీడియాతో మాట్లాడారు. పంచాయితీరాజ్ మంత్రిగా గర్విస్తున్నానన్నారు. సీఎం కెసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో జామ తండా కు పల్లె నిద్రకు వచ్చారని... ఇప్పుడు సీఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా ఈ రోజు మళ్ళీ అదే జామ తండా & హనుమాన్ తండాకు పల్లె నిద్ర చేయడానికి వచ్చానన్నారు. సీఎం కెసిఆర్ గిరిజన సమస్యలు తెలుసని... కాబట్టే రాష్ట్రం ఏర్పడ్డాక తండాలను గ్రామ పంచాయితీలు గా చేశారు అన్నారు.
సమైక్య రాష్ట్రంలో 8,690 వున్న గ్రామపంచాయతీ లను, రాష్ట్రం ఏర్పడ్డాక తండాలతో కలిపి 12,567 గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేశారు. అలాగే 4,383 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారు. 'మా తండాల్లో మా రాజ్యం' అన్న లంబాడా గిరిజనులను ఆత్మగౌరవాన్ని ఇనుమడింపచేశారన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ప్రతినెలా సిఎం కెసిఆర్ రూ.308 కోట్లను విడుదల చేస్తున్నారన్నారు. అందులోంచి ప్రతి గ్రామ పంచాయతీకి కనీసం రూ.5 లక్షలు అందుతున్నాయన్నారు. దీంతో పంచాయతీ సర్పంచ్ లకు నిధులు అందుబాటులో ఉండి వాటిని అవసరాలకు ఖర్చు చేయడానికి వీలవుతున్నదన్నారు. అలాగే ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్లు కూడా అందుబాటులో ఉండటంతో పారిశుద్ధ్యం, మంచినీటి వసతి సాధ్యపడుతున్నదని మంత్రి తెలిపారు.
గిరిజనుల సమస్యలు సీఎం కెసీఆర్ కి తెలుసు కాబట్టే గిరిజనులు అభివృద్ది చెందాలని అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ గ్రామం మొత్తం తిరిగాను ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి వ్యక్తిని పలకరించానని... ప్రతి ఒక్కరూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి అని ఆనందంగా చెబుతున్నారన్నారు. తండా మొత్తం సీసీ రోడ్లతో సుందరంగా వుందని... గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, స్మశాన వాటిక, నర్సరీ, రైతు వేదికలను చూశానన్నారు. ఈ తండాకు చెక్ డ్యాం నిర్మాణం ఒక్కటి బాకీ వుంది అది కూడా త్వరలో తీరుస్తానని మంత్రి హామీ ఇచ్చారు.