నాగార్జునసాగర్ బైపోల్: తెరపైకి లోకల్ నినాదం, నోముల కుటుంబానికి ఎర్త్
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బరిలోకి ఎవరిని దింపాలనే విషయమై టీఆర్ఎస్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లోకల్ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో దివంగత నోముల నర్సింహ్మయ్య కుటుంబానికి చెక్ పెట్టేందుకు స్థానిక నినాదాన్ని కొందరు నేతలు ముందుకు తెస్తున్నారు.
గతంలో కూడా ఈ నినాదాన్ని తెర మీదికి తెచ్చినా ప్రయోజనం దక్కలేదు. ఈ దఫా ఈ నినాదం ఏ మేరకు ప్రయోజనం కల్గిస్తోందోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది
గత ఏడాదిలో అనారోగ్యంతో నోముల నర్సింహ్మయ్య మరణించాడు. దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఈ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో నోముల నర్సింహ్మయ్య కుటుంబానికి సీటు ఇవ్వాలని ఆయన కుటుంబసభ్యులు టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతున్నారు. నర్సింహ్మయ్య సన్నిహితులు కూడ ఈ విషయాన్ని పరిశీలించాలని కేసీఆర్ ను కోరినట్టుగా చెబుతున్నారు.
2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీపీఎంను వీడిన నోముల నర్సింహ్మయ్య టీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసి జానారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యాడు. 2018 ఎన్నికల్లో జానారెడ్డిని ఓడించి నర్సింహ్మయ్య అసెంబ్లీలో అడుగుపెట్టాడు.
2014, 2018 ఎన్నికల సమయంలో కూడా నోముల నర్సింహ్మయ్యపై ఆయన ప్రత్యర్ధులు కొందరు స్థానికేతరుడని ప్రచారం చేశారు. 2014 ఎన్నికల్లో ఈ ప్రచారం నర్సింహ్మయ్యను దెబ్బతీసిందనే ప్రచారం కూడ ఉంది.
2018లో నోముల నర్సింహ్మయ్య జానారెడ్డిని ఓడించడంతో ఈ ప్రచారానికి పెద్దగా పస లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పార్టీలో కొందరు నేతలు నర్సింహ్మయ్యకు పొసగలేదు. దీంతో నర్సింహ్మయ్య ఆ నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేయించారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి సహాయంతో ఆ నేతలు సస్పెన్షన్ ను ఎత్తివేయించుకొన్నారు.
ఈ సమయంలోనే నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించారు. దీంతో నర్సింహ్మయ్య వ్యతిరేక వర్గం ఈ స్థానం నుండి పోటీకి రంగం సిద్దం చేసుకొంటుంది.
ఇదే సమయంలో మరోసారి స్థానికులకే సీటు ఇవ్వాలనే అంశాన్ని అధికార పార్టీలో కొందరు తెరమీదికి తీసుకొచ్చారు. లోకల్, నాన్ లోకల్ అనే అంశం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని శాసనమండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.
నర్సింహ్మయ్య కుటుంబానికి సీటు దక్కకుండా అడ్డుకొనేందుకు గాను లోకల్, నాన్ లోకల్ అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమౌతున్నాయి.
నోముల నర్సింహ్మయ్య తనయుడు భగత్, లేదా ఆయన సతీమణి లక్ష్మిలలో ఎవరికి ఒకరి సీటు ఇవ్వాలని నోముల అభిమానులు కోరుతున్నారు.
యాదవ సామాజిక వర్గానికి చెందిన వారికి ఈ స్థానం నుండి సీటు ఇస్తే సులభంగా విజయం సాధించే అవకాశాలుంటాయని కూడ కొందరు టీఆర్ఎస్ నాయకత్వం దృష్టికి తీసుకొస్తున్నారు.
నోముల కుటుంబానికి సీటు ఇవ్వకపోతే ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ లేదా ఇతర నేతల పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తోందని సమాచారం.
నోముల కుటుంబానికి ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోతే ఏ విధంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తారనే విషయమై టీఆర్ఎస్ నాయకత్వం నుండి స్పష్టత రావాల్సి ఉంది.