- Home
- Telangana
- దీప్తి డెత్ మిస్టరీ.. శరీరంపై గాయాలు, ఇంట్లో మద్యం సీసాలు, చంపలేదని చందన ఆడియో క్లిప్.. అసలేం జరిగింది?
దీప్తి డెత్ మిస్టరీ.. శరీరంపై గాయాలు, ఇంట్లో మద్యం సీసాలు, చంపలేదని చందన ఆడియో క్లిప్.. అసలేం జరిగింది?
జగిత్యాల జిల్లా కోరుట్లలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ దీప్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. ఆమె సోదరి చందన కనిపించకుండా పోవడం తీవ్ర సంచలనంగా మారింది. అసలు దీప్తి ఎలా చనిపోయింది?, చందన ఎందుకు పారిపోయింది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది.

అయితే దీప్తి, చందనలు నివాసం ఉన్న ఇంట్లో మద్యం సీసాలు ఉండటం.. తాను అక్కను చంపలేదని చందన పేరుతో ఆడియో బయటకు రావడం.. దీప్తి ఒంటిపై గాయాలు ఉండటం.. వంటి పరిణామాలు ఈ కేసు మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఏం జరిగిందనేది ఒకసారి పరిశీలిద్దాం..
కోరుట్ల భీమునిదుబ్బలో నివాసం ఉంటున్న శ్రీనివాసరెడ్డి, మాధవిలు బంధువు గృహప్రవేశానికి హాజరయ్యేందుకు ఆదివారం హైదరాబాద్కు వెళ్లారు. అయితే వారి కుమార్తె దీప్తి, చందనలు ఇంట్లోనే ఉన్నారు. దీప్తి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా ఉద్యోగం చేస్తుండగా.. బీటెక్ చేసిన చందన ఇంట్లోనే ఉంటోంది.
సోమవారం రాత్రి శ్రీనివాసరెడ్డి-మాధవి దంపతులు తమ కుమార్తెలతో ఫోన్లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం మళ్లీ వారికి ఫోన్ చేశారు. దీప్తి ఫోన్ తీయకపోగా, చందన ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ కూతుళ్లను చూడాలని ఇరుగుపొరుగు వారికి ఫోన్ చేశారు. ఇరుగుపొరుగు వారు ఇంటికి వెళ్లి చూడగా చందన కనిపించలేదు. దీప్తి శవమై పడి ఉంది. దీంతో వారు షాక్ తిన్నారు. అటు పోలీసులకు, ఇటు శ్రీనివాసరెడ్డి-మాధవిలకు సమాచారం అందజేశారు. ఈ ఘటనతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సోఫాలో దీప్తి మృతదేహాన్ని గుర్తించారు. వంటగదిలో రెండు మద్యం సీసాలు, కూల్ డ్రింక్ సీసాలు, కొన్ని స్నాక్స్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ఇక, పోలీసులు దీప్తి మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు. దీప్తితో పాటు ఇంట్లో ఉండి.. కనిపించకుండా పోయిన చందన కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. ఆమె ఒక యువకుడితో కలిసి మంగళవారం ఉదయం 5.30 గంటలకు నిజామాబాద్కు బస్సు ఎక్కినట్లు గుర్తించారు.
చందన, ఆమెతో పాటు ఉన్న గుర్తుతెలియని యువకుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. చందనతో పాటు ఉన్న యువకుడిని ఆమె ప్రియుడిగా అనుమానిస్తున్నారు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవీందర్ రెడ్డి కూడా ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఇక, దీప్తి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
అయితే ఈలోపే చందన పేరుతో ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. దానిని చందన తన సోదరుడు సాయికి పంపినట్టుగా చెబుతున్నారు. అందులో.. ‘‘అరేయ్ సాయి నేను చందక్కను రా.. నేను అసలు నిజమెంటో చెప్పాలా. దీప్తి అక్క నేను తాగుదామనుకున్నాం. కానీ నేను తాగలేదు. అక్కనే తాగింది. నేను మా ఫ్రెండ్ చేత తెప్పించాను.. అది నేను ఒప్పుకుంటాను. కానీ అక్కనే తాగింది. ఇక అక్క వాళ్ల బాయ్ఫ్రెండ్ను పిలుద్దామని అన్నది. నేను వద్దని చెప్పినా.. అయినా కూడా పిలుస్తాను అంది.
Korutla
సరేలే నీ ఇష్టం అన్నా. నేను ఇంట్లోంచి వెళ్లిపోదాం అనుకున్నా. అది నేను ఒప్పుకుంటాను. కానీ అక్కకి చెప్పి వెళ్లిపోదాం అనుకున్నాను. అక్క అల్రెడీ అప్పటికే హాఫ్ బాటిల్ కంప్లీట్ చేసింది. ఫస్ట్ ఫోన్ మాట్లాడి.. తర్వాత సోఫాలోకి వెళ్లి పడుకుంది. నేను రెండుసార్లు లేపాను. సరే పడుకుంది కదా అని నేను ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు. నేను ఒప్పుకుంటా.. ఛాన్స్ దొరికిందని చెప్పి నేనే వెళ్లిపోయినా. నా తప్పేం లేదు సాయి. నేను నిజం చెబుతున్నా. నాకు అక్కను చంపే ఉద్దేశం లేదు. ప్లీజ్ రా నమ్మురా. మేం రెండు బాటిల్స్ తెప్పించుకున్నాం. నేను బ్రీజర్ తాగా.. అక్క వోడ్కా తాగింది. తర్వాత నాకు ఏమైందో తెలీదు. నేనైతే వెళ్లిపోయినా. ఇట్లా అయితదని అస్సలు అనుకోలేదు. నేనెందుకు చంపుతా సాయి.. నేనేందుకు మర్డర్ చేస్తానురా దాన్ని..’’ అని వాయిస్ మెసేజ్లో ఉంది.
Korutla
అయితే ఈ కేసుకు సంబంధించి పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. అయితే దీప్తి వాళ్ల ఇంటికి మద్యం బాటిళ్లు ఎవరు తీసుకొచ్చారు?, రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..?, దీప్తి, చందన కాకుండా అక్కడికి ఎవరైనా వచ్చారా? చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకుంటే గొడవ జరిగిందా?.. ఆ గొడవలో దీప్తి ప్రాణాలు కోల్పోయిందా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే ఈ కేసులో చందన ఆచూకీ, దీప్తి పోస్టుమార్టమ్ నిమిత్తం కీలకం కానున్నాయి.