దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎఫెక్ట్: వరంగల్, ఖమ్మంపై కేసీఆర్ ప్లాన్ ఇదీ....
దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకత్వం కేంద్రీకరించింది.
వరంగల్, ఖమ్మం కార్పోరేషన్ల ఎన్నికలకు టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో అలర్టైన టీఆర్ఎస్ నాయకత్వం ముందు జాగ్రత్తలు తీసుకొంటుంది.
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఈ రెండు కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు మిగిలిన నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
ఈ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు వార్డుల విభజన, ఓటర్ల జాబితా విషయమై ఎన్నికల సంఘం ఆయా జిల్లా అధికారులకు లేఖ రాసింది.
బూత్ స్థాయిలో ఓటర్లను సమీకరించడానికి పార్టీ యంత్రాంగం సిద్దంగా లేరని పార్టీ నాయకత్వం గుర్తించింది. సానుకూల ఓటింగ్ పైనే పార్టీ క్యాడర్ ఆధారపడి ఉందని సమాచారం.
బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ భావిస్తున్నారు. ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని టీఆర్ఎస్ చీఫ్ తలపెట్టారు.
గతంలో వరంగల్, ఖమ్మం మున్సిపాలిటీల్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. అయితే ఈ రెండు పట్టణాల్లో టీడీపీ, లెఫ్ట్, కాంగ్రెస్ నేతలు బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
2016 ఎన్నికల్లో వరంగల్ లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో 58 డివిజన్లలో టీఆర్ఎస్ 44 స్థానాలను గెలుచుకొంది. ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల్లో 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ రెండు పట్టణాల్లో ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకొనేందుకు కమలదళం ప్రయత్నిస్తోంది.
ఈ రెండు పట్టణాల్లో సాగుతున్న రాజకీయ పరిణామాలను సీఎం కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల వ్యూహాలను పరిశీలించాలని మంత్రులకు కేసీఆర్ సూచించారని సమాచారం. ఈ రెండు జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటించే అవకాశం ఉంది.
2016లో ఖమ్మం కార్పోరేషన్ కు ఎన్నికలు జరిగిన సమయంలో ఆనాడు ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్న పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.
ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది కాలానికే పాలేరు ఉప ఎన్నికల సమయంలో పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు.
2018 ఎన్నికల్లో ఖమ్మం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు. 2016 ఖమ్మం కార్పోరేషన్ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ అభ్యర్ధుల విజయంలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలకంగా వ్యవహరించారు.
2018 ఎన్నికల్లో పాలేరు నుండి పోటీ చేసి ఓటమి పాలైన తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం స్ధబ్ధుగా ఉన్నారు. అయితే ఈ నెల 1వ తేదీన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం కొందరు తనను ఓడించారని ఆయన ప్రకటించారు.
ఖమ్మం కార్పోరేషన్ లో టీఆర్ఎస్ ను మరోసారి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను మంత్రి పువ్వాడ అజయ్ తన భుజాలపై వేసుకొన్నారు.
ఇక వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపు బాధ్యతను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై పడింది.వరంగల్ కార్పోరేషన్ ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందే ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు.
ఆ సమయంలో వరంగల్ జిల్లా నుండి కడియం శ్రీహరి కేసీఆర్ కేబినెట్ లో కొనసాగారు. శ్రీహరి కేసీఆర్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా కొనసాగిన విషయం తెలిసిందే.
ఈ రెండు కార్పోరేషన్లతో పాటు మిగిలిన నాలుగు మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించేలా గులాబీ బాస్ వ్యూహారచన చేస్తున్నారు.