బీజేపీలోకి ఈటల రాజేందర్: హుజూరాబాద్పై టీఆర్ఎస్ ఫోకస్
బీజేపీలో చేరడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ రంగం సిద్దం చేసుకొంటున్నారుు. తన అనుచరులతో లకిసి ఆయన కమలం పార్టీ తీర్థ: పుచ్చుకోనున్నారు. ఈ విషయమై బీజేపీ అగ్రనేతలతో ఆయన చర్చిస్తున్నారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరో వారం రోజుల్లో బీజేపీలో చేరనున్నారు. దీంతో హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది.
గత నెల 31వ తేదీన ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితరులను కలిశారు. ఇవాళ రాత్రికి ఆయన న్యూఢిల్లీ నుండి హైద్రాబాద్ కు తిరిగి రానున్నారు.
ఇస్సటికే రెండు దఫాలు అనుచరులతో ఈటల రాజేందర్ సమావేశాలు నిర్వహించారు. బీజేపీలో చేరే విషయమై ఆయన సంకేతాలు ఇచ్చారు. మరో వారం రోజుల్లో ఈటల రాజేందర్ బీజేపీలో చేరనున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇవాళ ప్రకటించారు.
హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మండలాల్లో ఈటల వెంట వెళ్లకుండా టీఆర్ఎస్ నాయకత్వం ఆ పార్టీ నేతలపై ఫోకస్ పెట్టింది. ఆర్ధికశాఖ మంత్రి హరీష్ రావుకు హుజురాబాద్ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు.
కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ తో పాటు జిల్లాకు చెందిన నేతలు హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాల పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. ఈటల వెంట వెళ్లకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. నేతలు మండలాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలనే ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు నిర్వహించిన సమావేశంలో ఈటల రాజేందర్ కు అనుకూలంగా కొందరు నేతలు నినాదాలు చేశారు.
ఈటల రాజేందర్ బీజేపీలో చేరడానికి ముహుర్తం చూసుకొంటున్నారు. తనతో వచ్చే నేతలతో కలిసి ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకొంటారు. ఈటల వెంటే ఎక్కువ మంది వెళ్లకుండా టీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే కొందరు ప్రజా ప్రతినిధులు తాము టీఆర్ఎస్ లోనే ఉంటామని ప్రకటించారు.
బీజేపీలో చేరడానికి ముందు ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ విషయమై ఈటల రాజేందర్ న్యాయ నిపుణుల సలహాలు తీసుకొంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వస్తే ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే విషయమై కూడ కమల నేతలతో ఆయన చర్చించారనే ప్రచారం సాగుతోంది.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరితే బీ ఫాం ఇచ్చిన పార్టీ నాయకత్వం స్పీకర్ కు ఫిర్యాదు చేసి అనర్హత వేటు వేయాలని కోరవచ్చు. అయితే అనర్హత వేటు వేసుకొనే అవకాశం తెచ్చుకొంటారా ముందే రాజీనామా చేస్తారా అనే విషయమై చర్చ సాగుతోంది.
ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన ప్రజా ప్రతినిధులు అనేక మంది ఉన్నారు. ఏపీ, తెలంగాణల్లో ఇలాంటి వారికి మంత్రి పదవులు కూడ అప్పగించారు. వారిపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ వద్ద ఫిర్యాదులు, కోర్టుల్లో కేసులు కూడ దాఖలయ్యాయి. అయితే ఈ లోపుగా ఐదేళ్ల పదవీకాలం పూర్తైంది.
హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తే ఈటల రాజేందర్ ను ఒడించేందుకు గులాబీ దళం ఇప్పటి నుండే క్షేత్రస్థాయి నుండి తమ వ్యూహలను అమలు చేస్తోంది