కేసీఆర్ సస్పెన్స్: ఆ పదవి దక్కితే కేబినెట్లో ఛాన్స్?
మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ సీఎం కేసీఆర్ సస్పెన్ష్ కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో కేసీఆర్ తొలిసారి మంత్రివర్గాన్ని విస్తరించారు. మిగిలిన ఖాళీలను పార్లమెంట్ ఎన్నికల తర్వాత భర్తీ చేస్తారని ప్రచారం సాగింది. కానీ, ఈ విషయంలో కేసీఆర్ మనసులో ఏముందనే విషయమై బయటకు రావడం లేదు.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎవరి పేరునుకేసీఆర్ నామినేట్ చేస్తారనే విషయమై ప్రస్తుతం టీఆర్ఎస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ పదవి ఎవరికి దక్కితే వారికి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంటుందనే చర్చ కూడ టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది.
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ దాఖలు చేయడానికి ఇంకా రెండు రోజుల పాటు మాత్రమే సమయం ఉంది.ఈ పదవి కోసం ఇద్దరు నేతల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. నల్గొండ మాజీ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్టీ నేత నవీన్ రావు పేరు కూడ ప్రధానంగా పోటీ ఉందని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మల్కాజిగిరి ఎంపీ స్థానం కోసం నవీన్రావు పేరు కూడ పరిశీలించింది టీఆర్ఎస్ నాయకత్వం. కానీ, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి టిక్కెట్టు దక్కింది. ఈ సమయంలో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్టు కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో మంత్రివర్గ విస్తరణలో కేసీఆర్ 10 మందికి చోటు కల్పించారు. మరో 6 ఖాళీలను మంత్రివర్గంలో భర్తీ చేయనున్నారు. కేసీఆర్ మంత్రివర్గంలోకి చోటు దక్కే అవకాశం ఎవరికీ దక్కనుందోననే చర్చ సర్వత్రా నెలకొంది.
ఎమ్మెల్యే కోటాలో నవీన్రావుకు ఎమ్మెల్సీ దక్కితే కేబినెట్లో ఆయనకు చోటు దక్కకపోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్సీ కాకుండా సుఖేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకొంటే ఆరు మాసాల్లోపుగా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక అవ్వాలి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నందున... చేస్తే హుజూర్ నగర్ నుండి పోటీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ స్థానంలో గత ఎన్నికల్లో సైదిరెడ్డి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఈ దఫా కూడ ఆయనకే టిక్కెట్టు దక్కే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలంటే.. ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్సీల అనర్హత కేసు విషయమై కోర్టు తీసుకొనే నిర్ణయం ఆధారంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆధారపడి ఉంటాయి.