Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ బరిలో టిడిపి..? సీటు నందమూరివారిదే.. ఎవరో తెలుసా?
Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూడా పోటీచేసేలా కనిపిస్తోంది. నందమూరి కుటుంబానికి ఈ సీటు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. మరి ఆ కుటుంబంనుండి ఎవరు బరిలోకి దిగనున్నారో తెలుసా?

జూబ్లీహిల్స్ ఉపపోరులో టిడిపి?
Jubilee Hills Bypoll : హైదరాబాద్ మహానగరంలో ఎన్నికల సందడి మొదలయ్యింది. ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోవడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటు ఖాళీ అయ్యింది. దీంతో బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఇక్కడ కూడా ఉపఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది... ఈమేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలచేసింది. అక్టోబర్ 13న నోటిఫికేషన్ విడుదలతో ఉపఎన్నిక ప్రక్రియ ప్రారంభంకానుంది... నవంబర్ 11 పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి పలితాన్ని వెల్లడించనున్నారు.
ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. షెడ్యూల్ విడుదల తర్వాత ఈ హీట్ మరింత పెరిగింది. బిఆర్ఎస్ ఇప్పటికే మరణించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. ఇక రాష్ట్రంలో అధికారపార్టీ కాంగ్రెస్, దేశంలో అధికార పార్టీ బిజెపి అభ్యర్థుల వేటలో ఉన్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ పేరు జూబ్లీహిల్స్ గట్టిగా వినిపిస్తోంది.
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ లీడర్స్, క్యాడర్ లో జోష్ నింపేందుకైనా ఈ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టాలని.. తద్వారా ఉనికిని చాటుకోవాలన్నది అధినేత ఆలోచనగా తెలుస్తోంది. తెలంగాణ టిడిపి లీడర్లు, క్యాడర్ కూడా ఇదే కోరుకుంటున్నారు. దీంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలపై ఓ నిర్ణయానికి వచ్చేందుకు తెలంగాణ టిడిపి నేతలతో చంద్రబాబు సమావేశం అవుతున్నారు.
తెలంగాణ టిడిపిలో నయా జోష్ తెస్తారా?
తెలుగుదేశం పార్టీకి కేవలం ఆంధ్ర ప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో కూడా మంచి బలం ఉంది. అందుకే ఏపీ రాజకీయాలపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టినా సమయం సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ రాజకీయాలపై ఓ కన్నేస్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలతో అలాంటి సందర్భం వచ్చింది... అందుకే టిడిపి లీడర్స్, క్యాడర్ లో నయాజోష్ నింపేందుకు ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని అధినేత భావిస్తున్నట్లు పొలిటికల్ టాక్ నడుస్తోంది.
హైదరాబాద్ లో టిడిపికి మంచి బలం ఉంది... దాన్ని వాడుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పాటుతర్వాత కూడా మొదటిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జూబ్లీహిల్స్ స్థానాన్ని టిడిపియే దక్కించుకుంది. ఇదిచాలు ఇక్కడ టిడిపి ఎంత బలంగా ఉందో చెప్పడానికి. అందుకే జూబ్లీహిల్స్ బరిలో టిడిపి అభ్యర్థిని నిలపాలని భావిస్తున్న చంద్రబాబు దీనిపై చర్చించేందుకు ఇవాళ(అక్టోబర్ 7, మంగళవారం) సాయంత్రం టిటిడిపి నేతలతో సమావేశం అవుతున్నారు.
ఉండవల్లిలోని తన నివాసానికి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నుండి తెలంగాణ టిడిపి నేతలకు ఆహ్వానం అందింది. దీంతో టిటిడిపి అధ్యక్షుడితో పాటు ఇతర కీలక నాయకులు ముఖ్యంగా హైదరాబాద్ నేతలు తరలివెళుతున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీ చేద్దామా? వద్దా? పోటీచేయాలనుకుంటే ఎవరిని బరిలోకి దింపుతాం? అనేదానిపై నాయకులతో చంద్రబాబు చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
జూబ్లీహిల్స్ టిడిపి అభ్యర్థిగా నందమూరి ఆడబిడ్డ పేరు?
ఒకవేళ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేయాలని టిటిడి నిర్ణయిస్తే అభ్యర్థి ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో కూకట్ పల్లి నుండి పోటీచేసిన నందమూరి సుహాసినికి అవకాశం ఇవ్వొచ్చనే ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఆంధ్రా ప్రజలు ఉన్నారు... కాబట్టి నందమూరి కుటుంబానికి చెందిన ఆడబిడ్డను బరిలోకి దింపితే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనేది టిడిపి ఆలోచనగా తెలుస్తోంది.
ఇక జూబ్లీహిల్స్ లో టిడిపి గెలుపు అవకాశాలను కొట్టిపారేయలేం... బలమైన అభ్యర్థిని బరిలో దింపితే ఊహించని ఫలితం రావచ్చని భావిస్తున్నారు. అందుకే మరికొందరు టిటిడిపి సీనియర్ల పేర్లు కూడా జూబ్లీహిల్స్ రేసులో వినిపిస్తున్నారు. మరి అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు? ఎవరివైపు మొగ్గు చూపుతారు? అనేది త్వరలోనే తేలనుంది.
టిడిపి, బిజెపి, జనసేన కూటమిగా వస్తాయా? సింగిల్ గా వస్తాయా?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో టిడిపి ఒంటరిగా పోటీచేస్తుందా? లేదంటే ఏపీలో మాదిరిగా జనసేన, బిజెపితో కలిసి ఎన్డిఏ కూటమిగా పోటీచేస్తుందా? అన్నది ఆసక్తికరం. ఒకవేళ ఈ మూడుపార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్ధిని బరిలో దింపితే పోటీ మరింత రసవత్తరంగా మారుతుంది. ప్రస్తుతానికి జూబ్లీహిల్స్ లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంది... ఒకవేళ కూటమి రంగంలో దిగితే ఇదికాస్త త్రిముఖ పోరుగా మారిపోతుంది.
అయితే ఈ మూడుపార్టీలు కూటమిగా ఏర్పడి పోటీచేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బిజెపి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థి ఎంపికప్రక్రియ కొనసాగుతోందని... రెండుమూడు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. దీన్నిబట్టి టిడిపితో కలిసివెళ్ళడం అనుమానమే. అయితే ఒకటి మాత్రం ఖాయం... బిజెపి, జనసేన లేదంటే టిడిపి, జనసేన కలిసి జూబ్లీహిల్స్ బరిలో నిలుస్తాయి.
జూబ్లిహిల్స్ లో టిడిపి హవా
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుండి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటువరకు జూబ్లీహిల్స్ అసెంబ్లీలో కాంగ్రెస్, టిడిపిదే హవా. కొన్ని దశాబ్దాలపాటు ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ దే పైచేయి...కానీ తెలంగాణ ఏర్పాటుతర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో అనూహ్యంగా టిడిపి విజయం సాధించింది. ఇటీవల చనిపోయిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో విజయం సాధించారు. ఇదిచాలు ఇక్కడ టిడిపి ఎంతబలంగా ఉందో చెప్పడానికి.
అయితే తెలంగాణలో టిడిపి బలం తగ్గడం, రాష్ట్ర విభజన తర్వాత ఆ పార్టీ ఫోకస్ మొత్తం ఏపీపైకి మారడంతో ఎమ్మెల్యేలంతా బిఆర్ఎస్ లో చేరిపోయారు. ఇలా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కు బిఆర్ఎస్ చేరిపోయారు... 2018, 2023 ఎన్నికల్లో బిఆర్ఎస్ నుండి పోటీచేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన సతీమణి మాగంటి సునీత బిఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్నారు.