- Home
- Telangana
- నేతాజి అస్తికలు ఎర్రకోటపైకి.... వాటిపైనే త్రివర్ణ పతాకం ఎగరాలన్నదే నా కోరిక..: పవన్ కల్యాణ్
నేతాజి అస్తికలు ఎర్రకోటపైకి.... వాటిపైనే త్రివర్ణ పతాకం ఎగరాలన్నదే నా కోరిక..: పవన్ కల్యాణ్
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలు ఎక్కడో జపాన్ లో దిక్కులేకుండా వున్నాయని... వాటిని ఇండియాకు తీసుకువచ్చేలా పెద్ద ఉద్యమం జరగాలని జనసేనాని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.

హైదరాబాద్: భారత స్వాతంత్ర్య సమరంలో వీరోచితంగా పోరాడిన సుభాష్ చంద్రబోస్ (నేతాజి) అస్తికలు తిరిగి భారత దేశానికి తీసుకురావాలన్నదే తన కోరికని... దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరి కోరిక కూడా ఇదేనని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఎక్కడో జపాన్ దేశంలోని రెంకోజీ టెంపుల్లో వున్న ఆయన అస్తికలు రెడ్ ఫోర్ట్ లో పెట్టాలని... దానిపై భారత మువ్వన్నెల జెండా ఎగరాలని తాను కోరుకుంటున్నట్లు పవన్ తెలిపారు.
గురువారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్ ఆధ్వర్యంలో ఎం.వి.ఆర్.శాస్త్రి రాసిన నేతాజీ గ్రంధం సమీక్ష కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ మాట్లాడుతూ... ఈ సభ నుంచి దేశం మొత్తం నేతాజీ గురించి మాట్లాడుకునేలా.. ఆయన తాలూకు అస్తికలు తిరిగి దేశానికి తెప్పించేందుకు ప్రభుత్వాధినేతలు, రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం బ్రింగ్ బ్యాక్ నేతాజీ యాషెస్, రెంకోజీ టూ రెడ్ ఫోర్ట్ అనే హ్యాష్ ట్యాగ్ లు రూపొందించామని... వీటిని సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేయాలని పవన్ సూచించారు.
మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కోసం టోక్యో వెళ్లినప్పుడు ఆనాటి పాస్ పోర్ట్ ఆఫీసర్ రాజశేఖర్ తనను నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్తికలు ఉన్న రెంకోజీ టెంపుల్ కు తీసుకువెళ్లాడని పవన్ తెలిపారు. ఇక్కడే నేతాజీ అస్తికలను భద్రపర్చినట్లు చెప్పిన ఆయన వాటివద్దకు తీసుకెళ్ళారు. ఇలా నేతాజీ అస్తికలు చూపిస్తే నా హృదయం ద్రవించుకుపోయింది. మన దేశంలో అక్రమాలు, అన్యాయాలు చేసిన వారికి పెద్ద పెద్ద స్మారకాలు కడతారు... చనిపోతే పెద్ద పెద్ద ఊరేగింపులు చేస్తారు.... ఇలాంటి మహానుభావుడు ఇంతటి చైతన్యం కలిగించిన వ్యక్తి ఎందుకు దిక్కు లేకుండా అయిపోయారు అని అనుకున్నానని ఆవేధన వ్యక్తం చేసారు. ఆ అస్తికలు చూస్తే నిజంగా ఏడుపు వచ్చిందన్నారు.
జపనీస్ సంస్కృతిలో భాగంగా పూర్వీకుల అస్తికలు దేవుడి గుడిలో భద్రపరుస్తారు. అలాంటిది ఎవరివో అక్కడ ఎందుకు పెడతారు. అవి కచ్చితంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారివి అని నేనే గాఢంగా నమ్మానని పవన్ పేర్కొన్నారు.
నేతాజీ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఉన్న 50 వేల మందిలో 30 వేల మంది బ్రిటీష్ ఆర్మీ నుంచి విడిపోయి వచ్చారని... . 20 శాతం మంది ఆయన కలిగించిన ప్రేరణ, రగిల్చిన స్ఫూర్తి నుంచి వచ్చిన వారేనని అన్నారు. ఆ 20 శాతంలో 70 శాతం దక్షిణ భారతం నుంచి వచ్చినవారేనని పవన్ తెలిపారు. ఝాన్సీ రాణీ రెజిమెంట్ ఆర్మీ పేరిట బెబ్బులి లాంటి ఆడపడుచుల్ని సైన్యంగా మలచిన వ్యక్తి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఆయన సైన్యం నుంచి 300 మంది ఆత్మాహుతి బృందంగా వెళ్లేందుకు సిద్ధమయ్యారని గుర్తుచేసారు. 50 మందిని మాత్రమే అందుకు ఎంపిక చేస్తే.. ఆత్మాహుతి దళంలో ఎంపిక కాలేదన్న నిరాశతో ఆరుగురు తుపాకీతో కాల్చుకుని చనిపోయారని... అలాంటి వారిని మన దేశం ఈ రోజుకీ గుర్తించలేకపోయిందని పవన్ అన్నారు.
నిన్న కాక మొన్న వచ్చిన వ్యక్తులకు కిరీటాలు, స్మారక భవనాలు నిర్మిస్తున్నాం.... దేశం కోసం ఇంత యుద్ధం చేసిన వ్యక్తిని గౌరవించుకోకపోతే అంతకు మించిన అవమానం ఏముంటుందని పవన్ అన్నారు. మనలో చలనం ఏ స్థాయిలో చచ్చిపోయిందో.. ఉదాసీన భావనతో మనం ఏ స్థాయిలో కొట్టుకుపోతున్నామో అర్ధం అవుతోందన్నారు. తన కోరిక ఒకటేనని... దేశం కోసం ఇన్ని లక్షల మంది ప్రాణ త్యాగాలు చేశారో వారి కోసం నిలబడదామన్నారు.. అందుకు ఎవరి ఆనందాలూ తగ్గించుకోమని చెప్పడం లేదు... కనీస బాధ్యతగా ఒక్క అడుగు వేద్దమన్నారు. 24 గంటల్లో కేవలం 15 నిమిషాలు దేశం కోసం ఆలోచించండని పవన్ అన్నారు.
కనీసం 100 రూపాయిల నోటు మీద నేతాజీ బొమ్మ ముద్రించాలని ఆకాంక్షిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు. ఫ్రీడం ఎట్ మిడ్ నైట్ కి రెండేళ్ల ముందు విదేశాల్లో మన మువ్వన్నెల జెండా ఎగిరిందని... జనగణమణకు మొదటి వెర్షన్ జైహింద్ నినాదం ఇచ్చింది సుభాష్ చంద్ర బోస్ గారేనని పవన్ తెలిపారు. ప్రతిఒక్కరూ మన నేతాజీ కోసం నిలబడాలని అడుగుతున్నా... ఆయన ఆస్తికలు దేశానికి తీసుకురావడంపై మనసు పెట్టండని సూచించారు. పూజా మందిరంలో, గదుల్లో, మసీదుల్లో, హిందూ మందిరాల్లో ఒకటే కోరిక పెడదాం... నేతాజీ అస్తికలు భారత్ కు రావాలని కోరుకుందాం. అదే ఈ సభ ఉద్దేశం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.