కుందూరుకు చుక్కలు: రెండు సార్లు ఆ నేతల చేతిలోనే జానారెడ్డి ఓటమి
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ ఎన్నికల్లో చావో రేవో తేల్చుకోనుంది. అందుకే ఈ స్థానం నుండి జానారెడ్డిని కాంగ్రెస్ బరిలోకి దింపుతోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా జానారెడ్డి బరిలో దిగుతున్నారు. ఇదే స్థానం నుండి జానారెడ్డి యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతలు రెండు సార్లు ఓడించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చలకుర్తి, నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించాడు. 1983 నుండి ఈ స్థానం నుండి ఆయన విజయం సాధించాడు.
1972, 1978 ఎన్నికల్లో నిమ్మల రాములు చలకుర్తి అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించాడు. నిమ్మల రాములు శిష్యుడిగా జానారెడ్డికి పేరుంది. గురువుపైనే జానారెడ్డి పోటీ చేసి విజయం సాధించాడు.
1983 లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా చలకుర్తి నుండి పోటీ చేసి జానారెడ్డి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 1985లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసి మరోసారి అసెంబ్లీలో ప్రవేశించాడు. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో జానారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పాడు.టీడీపీకి రాజీనామా చేసిన జానారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
1989లో ఇదే స్థానం నుండి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధించారు. 1994 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయకుండానే ఎన్నికల్లో పోటీ చేశారు. నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్దిని చూసి జనం ఓటేస్తారని జానారెడ్డి భావించారు.ఆ ఎన్నికల సమయంలో జానారెడ్డి ప్రచారం చేయలేదు.
ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి రామ్మూర్తి యాదవ్ విజయం సాధించారు. సర్పంచ్ గా పనిచేసిన రామ్మూర్తి యాదవ్ జానారెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1999, 2004,2009,2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుండి జానారెడ్డి గెలుపొందారు.
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 ఎన్నికల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో చలకుర్తి నియోజకవర్గం రద్దైంది. చలకుర్తి స్థానంలో నాగార్జునసాగర్ పేరుతో కొత్త అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైంది. ఈ నియోజకవర్గం నుండి కూడా జానారెడ్డి గెలుపొందారు.
2014 ఎన్నికల సమయంలో సీపీఎంకు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరి చివరి నిమిషంలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానం నుండి నోముల నర్సింహ్మయ్య జానారెడ్డిపై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో జానారెడ్డి విజయం సాధించారు. 2018 ఎన్నికల సమయంలో మరోసారి టీఆర్ఎస్ నాయకత్వం నోముల నర్సింహ్మయ్యకు సీటిచ్చింది.
నోముల నర్సింహ్మయ్య చేతిలో 2018 ఎన్నికల్లో జానారెడ్డి ఓటమి పాలయ్యాడు. జానారెడ్డి రెండు దఫాలు కూడా యాదవ సామాజిక వర్గానికి చెందిన నేతల చేతిలోనే ఓటమి పాలయ్యాడు.
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన అనారోగ్యంతో నోముల నర్సింహ్మయ్య మరణించాడు. దీంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది.
ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జానారెడ్డిని బరిలోకి దింపుతున్నట్టుగా ప్రకటించింది. టీఆర్ఎస్ నాయకత్వం ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు. నర్సింహ్మయ్య భార్య లక్ష్మీ లేదా తనయుడు భగత్ కు సీటివ్వాలని యాదవ సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు.
యాదవ సామాజిక వర్గం నేతలకు సీటిస్తే జానారెడ్డిని కట్టడి చేయవచ్చని ఆ సామాజికవర్గం నేతలు టీఆర్ఎస్ అధిష్టానానికి సూచిస్తున్నారు.
ఈ నియోజకవర్గంలో యాదవ సామాజిక వర్గం ఓటర్లు కీలక పాత్ర పోషిస్తారు. వీరితో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గం ఓటర్లు కూడ కీలకం కానున్నారు.