హైదరాబాద్ సిటీ కాలేజ్కు వందేళ్లు.. చరిత్ర ఘనం.. భవిష్యత్ గందరగోళం
హైదరాబాద్ సిటీ కాలేజ్కు ఘనమైన చరిత్ర ఉన్నది. కానీ, వర్తమానం గందరగోళం, భవిష్యత్ ఆందోళనకరం అన్నట్టుగా దాని పరిస్థితి ఉన్నది. సీలింగ్లు, గోడలు బలహీనంగా మారుతున్నాయి. వర్షాలు పడితే సీలింగ్ నుంచి నీళ్లు కురుస్తున్నాయి. రిపేర్లు, మెయింటెనెన్స్ పనులు ఈ మధ్య జరగనేలేవని కాలేజ్ విద్యార్థులే చెబుతున్నారు.
city college
హైదరాబాద్ నగర సౌందర్యానికి నిజాం కాలం నాటి కట్టడాలు మచ్చు తునకాలుగా నిలుస్తాయి. ఆ సుందర భవంతులను చూసి నగరవాసులు మురిసిపోతుంటారు. పర్యాటకులు పరవశించిపోతుంటారు. నగరానికి శోభనే కాదు.. హైదరాబాద్ సిటీ కాలేజ్ విద్యార్థులకు వివేకాన్ని, విద్యనూ అందిస్తున్నది. ఈ కాలేజ్కు వందేళ్లు నిండాయి. కాలేజీ యాజమాన్యం శతవార్షికోత్సవాలకు సిద్ధమవుతున్నది. మరో వందేళ్లు కాలేజ్ను నిలపడానికి దిద్దుబాటు చర్యలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. 1921లో 30 మంది విద్యార్థులతో సిటీ కాలేజ్ మొదలైంది. ఈ కాలేజ్ చరిత్రంతా ఘనంగా ఉన్నా వర్తమానం మాత్రం చిందరవందరగా ఉన్నది. కాలేజ్
భవిష్యత్పై నీలినీడలు అలుముకుంటున్నాయి.
సిటీ కాలేజ్ ఘన చరిత్ర ఇప్పుడు చరిత్రలో కలిసిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాలేజీలో రిపేర్లు, మెయింటెనెన్స్లు ఈ మధ్యకాలంలో జరిగింది లేదని ఆ కాలేజీ విద్యార్థులు వాపోతున్నారు. వర్షాలు కురిసినప్పుడు సీలింగ్, గోడల నుంచి నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. వందేళ్ల కింద ఈ కాలేజ్ ఎలా ఉండేదో ఇప్పుడు ఊహించుకోలేమని అన్నారు. అసలు ఇప్పటి దుస్థితి గురించి మాట్లాడాలా? లేక ఘనమైన చరిత్రనే తలుచుకోవాలా? ఏది ప్రయోజనకరమనే ప్రశ్నలనూ వాళ్లు అడుగుతున్నారు.
city college
నాణ్యమైన విద్యను అందించాలనే నిజాంల సంకల్పం నుంచి ఈ కాలేజ్ ఆవిర్భవించింది. ఆరో నిజాం మహబూబ్ అలా ఖాన్ బహదూర్ నగరంలో తొలి పాఠశాలను 1865లో స్థాపించారు. తర్వాత దాన్ని ప్రస్తుత మూడంతస్తుల కాలేజీకి మార్చారు. తర్వాత అదే సిటీ కాలేజ్గా ఘనతను చాటుకుంటూ వస్తున్నది. 1921లో 30 విద్యార్థులతో ప్రారంభమైన ఈ కాలేజీ నేడు 4,500 మంది పీజీ, యూజీ విద్యార్థులకు, మరో 2000 మంది ఇంటర్ కాలేజీ విద్యార్థులకు విద్యను అందిస్తున్నది. తక్కువ వనరులతోనే కాలాన్ని నెట్టుకుంటూ వస్తున్నది. ఈ కాలేజ్ను మరో వందేళ్లు కొనసాగించాలని కాలేజీ అల్యూమ్నీ, బోధకులు, నగరవాసులూ భావిస్తున్నారు.
స్థాపించినప్పటి నుంచి దీర్ఘకాలం నగరంలో నెంబర్ వన్ కాలేజీగా ఇది నిలిచింది. ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్గా ఉన్నదని కాలేజీ అల్యూమ్నీ చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ రిజిస్ట్రార్ సీ విద్యాధర్ భట్, భారత తొలి పట్టణ ప్రణాళికాకర్త ఎం ఫయాజుద్దీన్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పీ శివ శంకర్, శివరాజ్ పాటిల్, అర్జునఅవార్డీ ఫుట్ బాల్ క్రీడాకారుడు యూసుఫ్ ఖాన్, క్రికెటర్ అర్షద్ అయూబ్, ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ సయ్యద్ సలీం అలీ సహా మరెందరో ఈ కాలేజీలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారు.