- Home
- Telangana
- రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు లేదా..! సింప్లిసిటీలో గుమ్మడి నర్సయ్య నే మించిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇకలేరు
రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు లేదా..! సింప్లిసిటీలో గుమ్మడి నర్సయ్య నే మించిపోయిన మాజీ ఎమ్మెల్యే ఇకలేరు
సైకిల్ పై తిరిగే మాజీ ఎమ్మెల్యే ఎవరు అనగానే టక్కున గుమ్మడి నర్సయ్య పేరు గుర్తుకువస్తుంది. కానీ ఆయనకు కనీసం సొంత ఇళ్లయినా ఉంది… రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా సొంతిల్లు కూడా లేని నాయకుడు ఎవరో తెలుసా?

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి మృతి
Kommidi Narasimha Reddy : తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇవాళ (జూలై 7, మంగళవారం) ఉదయం కన్నూమూశారు. 85 ఏళ్ల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ లో కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు.. రాత్రి పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున 5 గంటలకు కన్నుమూశారు. దీంతో భువనగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులే కాదు ప్రజలు నివాళి అర్పిస్తున్నారు.
మాజీ ఎమ్మెల్యేకు సొంత ఇల్లు లేదా..?
ఈ రోజుల్లో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు ఫ్యామిలీ మొత్తం కూర్చుని తిన్నా తరగతి ఆస్తులు సంపాదించేవారు ఎందరో ఉన్నారు. కానీ గతంలో కొందరు ఎమ్మెల్యేలు ప్రజాసేవకు మాత్రమే పరిమితం అయ్యారు.. కాంట్రాక్టులు, కమీషన్ల కోసం కక్కుర్తి పడలేదు. అలాంటి నాయకుల గురించి ప్రస్తావన రాగానే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య పేరు వినిపిస్తుంది. కమ్యూనిస్ట్ పార్టీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆస్తిపాస్తులు సంపాదించుకోని నిరాడంబరమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. ఇప్పటికీ ఓ చిన్న ఇంట్లో నివాసం, సైకిల్ పై ప్రయాణం చేస్తుంటారు.
గుమ్మడి నర్సయ్య లాగే కొమ్మడి నర్సింహరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పనిచేసినా ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. 1978-85 మధ్య రెండుసార్లు భువనగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు... అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తిపాస్తులు సంపాదించలేదు. ప్రభుత్వ ధనాన్ని ప్రజలకోసం ఖర్చు చేసి గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు . అందుకే మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన చనిపోయేనాటికి సొంత ఇల్లు కూడా లేదు... ఓ స్కూటర్ మాత్రమే అతడి ఆస్తి.
ఇలా గుమ్మడి నర్సయ్య, కొమ్మిడి నర్సింహరెడ్డిల ఇంటి పేర్లు, వ్యక్తి పేర్లే కాదు భావాలు ఒకేలా ఉన్నాయి. కానీ నర్సయ్యకు నిరాడంబరంగా ఉంటాడనే గొప్ప పేరయినా వచ్చింది.. నర్సింహారెడ్డికి అదికూడా లేదు. ఇప్పటికీ అతడి గురించి చాలామందికి తెలియదు... ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసినా కొమ్మడి నర్సింహారెడ్డి ప్రచారాన్ని కోరుకోలేదు.
ఆస్తులు దానం చేసిన నర్సింహారెడ్డి..
సాధారణంగా ఎవరైనా ఎమ్మెల్యేగా గెలవగానే ఎన్నికల్లో ఖర్చుచేసిన మొత్తాన్ని రాబట్టుకోవాలని చూస్తారు. ఆ తర్వాత కుటుంబం మొత్తం జీవితాంతం హ్యాపీగా బ్రతికేందుకు కావాల్సిన డబ్బులు, ఆస్తిపాస్తులు సంపాదిస్తారు. కానీ కొమ్మిడి నర్సింహారెడ్డి మాత్రం చాలా భిన్నమైన రాజకీయ నాయకుడు. తాను నమ్ముకున్న ఆశయాల కోసమే బ్రతికాడు.. రాజకీయాలు అంటే ప్రజాసేవ మాత్రమేనని నమ్మాడు. అందుకే ఎమ్మెల్యేగా గెలిచాక ఆస్తులు సంపాదించడం కాదు వారసత్వంగా సంక్రమించిన ఆస్తులను దానం చేశారు. అందుకే అతడిని భూదాన్ రెడ్డి అనికూడా భువనగిరి ప్రజలు పిలుచుకుంటారు.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ మండలం బ్రాహ్మణపల్లిలో పెద్ద భూస్వామ్య కుటుంబంలో జన్మించారు నరసింహారెడ్డి. అయితే అతడు చిన్నప్పటినుండి ఆదర్శ భావాలు కలిగివుండేవాడు... అందుకే పెద్దల ఆస్తిని భూదానోద్యమంలో దానం చేశాడు. చివరకు సొంత ఇంటిని కూడా ఉంచుకోలేదు. ఎమ్మెల్యేగా ఎలాంటి అవినీతి అక్రమాలకు తావు ఇవ్వలేదు... తానే కాదు చుట్టూ ఉండే నాయకులు అవినీతికి పాల్పడకుండా చూశారు. ఇలా తోటి ఎమ్మెల్యేలు వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినా నరసింహారెడ్డి రూపాయి సంపాదించలేదు... ప్రజల అభిమానాన్ని మాత్రమే సంపాదించగలిగారు.
నరసింహారెడ్డి రాజకీయ జీవితం...
భువనగిరి జిల్లా బ్రాహ్మణపల్లిలో మంచి పలుకుబడి కలిగిన కుటుంబంలో పుట్టిన నరసింహారెడ్డి చిన్న వయసులోనే రాజకీయ రంగప్రవేశం చేశారు. 19 ఏళ్ళ వయసులోనే గ్రామానికి సర్పంచ్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత భువనగిరి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. 1978 లో ఇతడు కాంగ్రెస్ తరపున భువనగిరి అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు.
తెలంగాణ ఉద్యమంలోనూ నర్సింహారెడ్డి పనిచేశారు... ఈ సమయంలోనే మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డితో సన్నిహితంగా ఉండేవారు. భువనగిరి డెవలప్మెంట్ కు విశేషంగా కృషి చేశారు. అయితే వయసు మీదపడటంతో రాజకీయాలకు దూరమైన నరసింహారెడ్డి ఇవాళ తుదిశ్వాస విడిచారు.

