దుబ్బాక బైపోల్: రూట్ మార్చిన కాంగ్రెస్, ఠాగూర్ మార్క్ రాజకీయం
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణికం ఠాగూర్ పార్టీ రాష్ట్ర నాయకులకు చుక్కలు చూపిస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో వచ్చే ఫలితం ఆధారంగానే నేతలకు పార్టీలో పదవులు కట్టబెడతారనే ప్రచారం సాగుతోంది.దీంతో కాంగ్రెస్ నేతలు రూట్ మార్చారు.
ఈ ఏడాది నవంబర్ 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాత బరిలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపింది. బీజేపీ అభ్యర్ధిగా రఘునందన్ రావును బరిలోకి దింపింది.
నియోజకవర్గంలోని ఏడు మండలాలకు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలను ఇంఛార్జీలుగా నియమించింది. అంతేకాదు ఈ నియోజకవర్గంలోని 146 గ్రామాలకు ఇంచార్జీలను కూడ కాంగ్రెస్ పార్టీ నియమించింది.
గ్రామస్థాయితో పాటు మండలాలవారీగా ఇంచార్జీలుగా నియమితులైన నేతలంతా తమ పరిధిలో పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చేలా చూడాలని పార్టీ నేతలకు ఇంచార్జీ మాణికం ఠాగూర్ ఆదేశించారు.
కీలక నేతలు కూడ ఏదో ఒక పోలింగ్ బూత్ కు ఇంచార్జీగా కూడ ఉండాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. తాము ఇంచార్జీగా ఉన్న పోలింగ్ బూత్ లో ఇతర పార్టీల కంటే మెరుగైన ఓట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి వచ్చేలా చూడాల్సిన బాధ్యత వీరిపై ఉంది.
ప్రతి రెండు రోజులు లేదా మూడో రోజున దుబ్బాక నియోజకవర్గంలో ఇంచార్జీలుగా ఉన్న నేతలతో మాణికం ఠాగూర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో పరిస్థితిని ఆయన వాకబు చేస్తున్నారు.
చెరుకు ముత్యం రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డిని బరిలోకి దింపడం ద్వారా తమకు కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చెరుకు ముత్యం రెడ్డి అనుచరులను తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది.
ప్రతి ఇంటిలో ప్రచారం వెళ్లేలా పార్టీ నాయకత్వం ప్లాన్ చేసింది. క్షేత్రస్థాయిలోకి పార్టీ ప్రచారాన్ని తీసుకెళ్లేలా నేతలు ప్లాన్ చేసుకోవాలని ఆయన సూచించారు. గతం కంటే భిన్నంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఎన్నికల సమయంలో పని చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధికి మెరుగైన ఫలితాలు వచ్చేందుకు తీసుకొచ్చిన వారికి పార్టీ పరంగా పదవులు వచ్చేందుకు తాను కృషి చేస్తానని ఠాగూర్ పార్టీ నేతలకు హామీ ఇచ్చినట్టుగా సమాచారం. దీంతో ఆయా మండలాలు, గ్రామాల్లో పార్టీ నేతలు తమ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు.