డేటా చోరీ: ఐటీ గ్రిడ్ యజమాని ఆశోక్ మెడకు ఉచ్చు
ఏపీ ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాబేస్ చోరీకి గురైందని లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్ యజమాని ఆశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఏపీ ప్రజలకు చెందిన వ్యక్తిగత సమాచారంతో కూడిన డేటాబేస్ చోరీకి గురైందని లోకేశ్వర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐటీ గ్రిడ్ యజమాని ఆశోక్ కోసం సైబరాబాద్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆశోక్కు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు.తమ ముందు లొంగిపోవాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ కోరారు. లేకపోతే అరెస్ట్ చేస్తామని సజ్జనార్ హెచ్చరించారు.
ఐటీ గ్రిడ్పై హైద్రాబాద్లో కేసు నమోదు కావడం ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదంగా మారింది. ఏపీ ప్రజల డేటా చోరీకి గురైతే ఈ కేసును ఏపీకి ఎందుకు బదిలీ చేయడం లేదని టీడీపీ నేతలు, ఏపీకి చెందిన మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ హైద్రాబాద్లో ఉంది, ఫిర్యాదుదారుడు కూడ హైద్రాబాద్లోనే ఫిర్యాదు చేశారని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఐటీ గ్రిడ్ యజమాని ఆశోక్ పోలీసులకు చిక్కితేనే కీలక సమాచారాన్ని రాబట్టవచ్చని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెబుతున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థలో తమ సోదాలో కీలకమైన సమాచారాన్ని సేకరించినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను ఈ కేసులో సాక్షులుగా పరిగణించారు.
ఆశోక్ను పట్టుకొంటేనే కీలకమైన సమాచారం వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. సైబరాబాద్కు చెందిన నాలుగు పోలీస్ బృందాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఆశోక్ కోసం వేటను కొనసాగిస్తున్నాయి. ఐటీ గ్రిడ్ సంస్థకు ఏపీ ప్రభుత్వానికి చెందిన లబ్దిదారుల సమాచారం ఎలా చేరిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై ఆశోక్ చిక్కితే మరింత సమాచారం లభించే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ఐటీ గ్రిడ్ సంస్థకు ఏపీ ప్రభుత్వ లబ్దిదారుల సమాచారం చేరవేయడంలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఏమైనా ఉందా, ఏపీ ప్రభుత్వానికి, ఈ సంస్థకు మధ్య ఏమైనా ఒప్పందాలున్నాయా అనే విషయాలపై స్పష్టత రావాలంటే ఆశోక్ను విచారించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
ఐటీ గ్రిడ్ సంస్థలో సైబరాబాద్ పోలీసులు నిర్వహించిన దర్యాప్తులో డేటా చోరీ జరిగిందనే విషయాన్ని ప్రాథమికంగా గుర్తించినట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఏపీ ప్రజలకు చెందిన ఆధార్, ఓటరు జాబితా, చిరునామా, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితా ఉన్నట్టుగా గుర్తించారు.
టీడీపీకి చెందిన సేవా మిత్ర యాప్లో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలకు చెందిన సానుభూతిపరులైన ఓటర్లు, తటస్థులైన ఓటర్ల వివరాలు ఉన్నట్టుగా గుర్తించారు. వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఏ పార్టీకి ఓటు చేయనున్నారనే విషయాన్ని విశ్లేషించేందుకు ఈ సమాచారాన్ని భద్రపరిచి ఉంటారని పోలీసులు చెబుతున్నారు.
ఐటీ గ్రిడ్ సంస్థపై వైకాపా యువజన విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సార్నగర్ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థపై మరో కేసు నమోదు చేశారు. టీడీపీకి వ్యతిరేక ఓటర్లను జాబితా నుండి తొలగించేందుకు ఐటీ గ్రిడ్ సంస్థ ప్రయత్నిస్తోందని ఆయన ఫిర్యాదు చేశారు.