హైదరాబాద్ నడిబొడ్డున... కొండచరియలు విరిగి ఇళ్లపై బండరాళ్లు
బంజారాహిల్స్ ప్రాంతంలో కొండపైనుండి బండరాళ్లు దొర్లి ఇళ్లపై పడి ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్: ఎక్కడో అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలు చూశాం. కానీ రాజధాని నగరం... ఎప్పుడూ బిజీగా వుండే హైదరాబాద్ లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. బంజారాహిల్స్ ప్రాంతంలో కొండపైనుండి బండరాళ్లు దొర్లి ఇళ్లపై పడి ప్రమాదం చోటుచేసుకుంది.
ఎగువన బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని గుట్ట మీద నుంచి వచ్చిన బండరాళ్ళు మన్సూర్ అనే వ్యక్తి ఇంటితో పాటు మరో ఇంటిపై పడ్డాయి. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ ఇంటితో పాటు వస్తువులు ధ్వంసమై ఆస్తినష్టం జరిగింది.
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న నగర్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అక్కడకు చేరుకుని దెబ్బ తిన్న ఇండ్లను పరిశీలించారు. ఈ ఘటనలో ఇళ్లు దెబ్బతిన్న కుటుంబాలను పరామర్శించిన మేయర్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.