జీహెచ్ఎంసీ రిజల్ట్స్ 2020: ఆరు అసెంబ్లీలో బీజేపీకి దక్కని ప్రాతినిథ్యం, ఒక్క స్థానంలోనే 11 సీట్లు
జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న బీజేపీ తొలి నుండి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది.బీజేపీ నిర్వహించిన ప్రచారానికి ఓటర్లు కూడ స్పందించారు. 48 స్థానాలను కైవసం చేసుకొని బీజేపీ టీఆర్ఎస్ కు సవాల్ విసిరింది.
జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు. మిగిలిన 18 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ బోణి కొట్టింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న బీజేపీ మొదటి నుండి వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. బీజేపీ అగ్ర నేతలంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
టీఆర్ఎస్ను ఢీ అంటే ఢీ అంటూ బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించారు. ఎంఐఎం, టీఆర్ఎస్ లపై బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకొంటామనే ధీమాతో బీజేపీ చెప్పింది. కానీ టీఆర్ఎస్ కు మాత్రం బీజేపీ ఈ ఎన్నికల్లో చుక్కలు చూపింంది. 48 సీట్లను కైవసం చేసుకొన్న బీజేపీ కారును కంగారు పెట్టింది.
పాతబస్తీతో పాటు కొత్త నగరంలో కూడా బీజేపీ సీట్లను గెలుచుకొంది. చాంద్రాయణ గుట్టలోని ఏడు డివిజన్లలో మాత్రం ఆ పార్టీకి ఒక్క సీటు కూడ దక్కలేదు.ఈ నియోజకవర్గంలోని ఏడు డివిజన్లను ఎంఐఎం దక్కించుకొంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆరు డివిజన్లు ఉంటే నాలుగు టీఆర్ఎస్, రెండు ఎంఐఎం దక్కించుకొంది.ఇక్కడ కూడ బీజేపీకి ఒక్క స్థానం దక్కలేదు.
చార్మినార్ నియోజకవర్గంలో ఐదు స్థానాలుంటే ఐదింటిని ఎంఐఎం గెలుచుకొంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఐదు స్థానాల్లో బీజేపీకి ఒక్కటి కూడా దక్కలేదు.పటాన్ చెరులో మూడు స్థానాలు టీఆర్ఎస్ కు దక్కాయి. ఒక్క దానిలో కూడ బీజేపీ గెలవలేదు.
బహదూర్ పురలో కూడ బీజేపీ ఒక్క స్థానం కైవసం చేసుకోలేదు. ఈ నియోజకవర్గంలోని ఆరు స్థానాలను ఎంఐఎం దక్కించుకొంది.
ఇక ఎల్బీనగర్ నియోజకవర్గంలోనే బీజేపీకి అత్యధికంగా 11 కార్పోరేటర్ సీట్లు దక్కాయి. ఈ నియోజకవర్గంలోని 11 డివిజన్లను బీజేపీ దక్కించుకొంది. ఇక్కడ టీఆర్ఎస్, ఎంఐఎంలకు ఒక్క స్థానం కూడ దక్కలేదు.
గోషామహల్ లో ఆరు కార్పోరేటర్ స్థానాలుంటే ఐదింటిని బీజేపీ గెలుచుకొంది. ఒక్క స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది. ముషీరాబాద్ లోని ఆరు స్థానాల్లో బీజేపీ ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఒక్క స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది.
ఎల్బీనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఎక్కువ సంఖ్యలో బీజేపీ కార్పోరేట్ స్థానాలను దక్కించుకొంది. మహేశ్వరం నియోజకవర్గంలో రెండు స్థానాలను బీజేపీ గెలుచుకొంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఒక్క స్థానంలోనే బీజేపీ గెలిచింది. కానీ ఈ దఫా మాత్రం రెండు స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది.