ఫ్రిజ్, కారు, వాషింగ్ మిషిన్.. వీటితో కూడా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు.
భారతదేశంలో డిజిటల్ పేమెంట్స్ ఇప్పటికే సాధారణ జీవనంలో భాగమైపోయాయి. ప్రతి రోజు లక్షలాది మంది యూపీఐ వాడుతూ డబ్బు పంపడం, బిల్లులు చెల్లిస్తున్నారు. ఈ సౌకర్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్గ్రేడ్ చేస్తోంది.

ఇకపై ఫోన్ మాత్రమే కాదు, స్మార్ట్ డివైజ్లతో చెల్లింపులు
యూపీఐ 3.0లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) టెక్నాలజీని జోడించారు. అంటే ఇకపై కేవలం స్మార్ట్ఫోన్లో యూపీఐ యాప్ అవసరం లేదు. స్మార్ట్వాచ్లు, టీవీలు, ఫ్రిజ్లు, కార్లు, వాషింగ్ మెషీన్లు వంటి పరికరాలు వాటంతటవే చెల్లింపులు చేయగలవు. ఉదాహరణకు నెలవారీ OTT సబ్స్క్రిప్షన్, EMI, మెయింటెనెన్స్ బిల్లులు వంటివి నేరుగా డివైజ్ల ద్వారా చెల్లిస్తారు.
ఆటోమేటెడ్ పేమెంట్స్కి మరింత సౌకర్యం
ప్రస్తుతం ఉన్న UPI AutoPay ఫీచర్ను మరింత ఆధునికంగా మార్చి UPI 3.0లో అందించనున్నారు. వినియోగదారులు ఒకసారి మ్యాండేట్ సెట్ చేస్తే, తర్వాత మనిషి జోక్యం లేకుండా డివైజ్ ఆటోమేటిక్గా పేమెంట్ చేస్తుంది. అయితే ఇది కొన్ని పరిమితులు, భద్రతా ప్రమాణాల కిందనే అమలు అవుతుంది.
అక్టోబర్లో అధికారిక ప్రకటన
యూపీఐ 3.0కు సంబంధించిన అధికారిక లాంచ్ గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ 2025లో జరగనుంది. ఈ ఫెస్టివల్కు ముంబై వేదిక కానుంది. రెగ్యులేటరీ అనుమతులు రాగానే NPCI కొత్త సదుపాయాలపై పూర్తి వివరాలను ప్రకటించనుంది.
పెరుగుతున్న యూపీఐ లావాదేవీలు
యూపీఐ వినియోగం ఎంత వేగంగా పెరుగుతుందో గణాంకాలే చెబుతున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో 18,580 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఇది 2023–24తో పోలిస్తే 41.7% ఎక్కువ. రిజర్వ్ బ్యాంక్ నివేదిక ప్రకారం, గత సంవత్సరం భారత్లో జరిగిన రిటైల్ చెల్లింపులలో 83% యూపీఐ ద్వారానే జరిగాయి.
యూపీఐ 3.0 ఎందుకు గేమ్ ఛేంజర్ అవుతుంది?
* మల్టీ-డివైజ్ సపోర్ట్ – కేవలం మొబైల్ మాత్రమే కాకుండా అన్ని స్మార్ట్ గాడ్జెట్ల ద్వారా లావాదేవీలు చేసుకోవచ్చు.
* పూర్తి ఆటోమేషన్ మ్యాండేట్ - సెట్ చేసిన తర్వాత మానవ జోక్యం లేకుండా చెల్లింపులు.
* అత్యాధునిక భద్రతా ఫీచర్లు – మల్టీ లేయర్ వెరిఫికేషన్.
* ప్రపంచస్థాయి ఆకర్షణ – ఇప్పటికే యూపీఐను కొన్ని విదేశీ దేశాల్లో ఉపయోగిస్తున్నారు. యూపీఐ 3.0 ద్వారా గ్లోబల్ యాక్సెసిబిలిటీ మరింత పెరుగుతుంది.