Inspiring Story : గవర్నమెంట్ స్కూల్ నుండి సైంటిస్ట్ దిశగా.. తెలుగమ్మాయి సంచలనం
ఓ గవర్నమెంట్ స్కూల్ చిన్నారి యావత్ తెలంగాణ గర్వించేలా చేసింది. తన ఆలోచనలకు పదును పెట్టి ట్రాఫిక్ సమస్యకు అద్భుత పరిష్కారం చూపించింది. ఆమె ఆవిష్కరణ ఏంటి..? ఇది ట్రాఫిక్ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది..?

గవర్నమెంట్ స్కూల్ చిన్నారి ఆలోచన అదుర్స్..
Success Story : గవర్నమెంట్ స్కూల్ అంటే చదువు సరిగ్గా చెప్పరు, వసతులు బాగుండవు అనే భావన సమాజంలో ఉంది. అక్కడ చదివే పిల్లలకు టాలెంట్ ఉండదని భావిస్తుంటారు. కానీ అలాంటి సర్కార్ బడిలో చదివే అబ్దుల్ కలాం లాంటివారు దేశమే గర్వపడేలా చేశారు. ఎంతోమంది ఐఎఎస్, ఐపిఎస్, డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా అద్భుతాలు చేయగలరని ఇప్పటికే చాలామంది నిరూపించారు. తాజాగా వీరిబాటలోనే నడుస్తోంది ఓ తెలంగాణ అమ్మాయి.

7వ తరగతిలోనే ఎంత గొప్ప ఆలోచన...
పట్టణాలు, నగరాల్లో వాహనదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో పార్కింగ్ ఒకటి. రద్దీ ప్రాంతాల్లో వాహనం ఎక్కడ పార్క్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేలా తెలంగాణలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. ఆమె రూపొందించిన సైన్స్ ప్రాజెక్ట్కు కేంద్రం నుంచి పేటెంట్ లభించడం విశేషం.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (టి) మండలంలోని భూపాలపట్నం గ్రామానికి చెందిన మమత 7వ తరగతి చదువుతోంది. 13 ఏళ్ళ వయసులోనే ఈమె టెక్నాలజీ సాయంతో అద్భుతాలు చేస్తోంది. ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న మమత “పార్కింగ్ మేనేజ్మెంట్ ఇన్ క్రౌడెడ్ ప్లేసెస్” పేరుతో రూపొందించిన ప్రాజెక్ట్కు తాజాగా పేటెంట్ నమోదైంది.
ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటి..?
పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, కార్యాలయాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పార్కింగ్ ఖాళీగా ఉందా..? లేక నిండిపోయిందా..? అనే సమాచారాన్ని సులభంగా తెలుసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుంది. ఈ మోడల్లో IR సెన్సార్, LCD డిస్ప్లే ఉపయోగించారు. పార్కింగ్ స్థలంలో వాహనం ఉంటే “Slot Full”, ఖాళీగా ఉంటే “Slot Empty” అని చూపిస్తుంది. దీంతో వాహనదారులు సులభంగా ఖాళీ స్థలం గుర్తించి పార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాల నుంచి తొలి పేటెంట్
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిగా పేటెంట్ పొందిన తొలి విద్యార్థిని మమతేనని విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రదర్శనల్లో ఈ ప్రాజెక్ట్ను ప్రదర్శించిన మమతకు ఇప్పటికే ప్రశంసలు దక్కాయి.
మమత ప్రాజెక్ట్ గురించి తెలుసుకుని స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు ఆమెను సత్కరించారు. ఇది మమతకే కాకుండా మొత్తం జిల్లాకే గర్వకారణమని అన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ నికోలస్ కూడా స్పందిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న నిజ జీవిత సమస్యను గుర్తించి సాంకేతిక పరిష్కారం చూపేందుకు మమత చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు.
రైతు కూలీ కూతురి కల
వ్యవసాయ కూలీ కుటుంబానికి చెందిన మమత భవిష్యత్తులో ఇంజనీర్ కావాలని ఆశిస్తోంది. తనకు ప్రోత్సాహం అందించిన ఉపాధ్యాయులు, అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది. మమత విజయంపై కలెక్టర్ హరిత, జిల్లా విద్యాశాఖాధికారి లలిత, ఉపాధ్యాయుడు మౌలాకర్ కేశవ్, జిల్లా సైన్స్ అధికారి కె మధుకర్ అభినందనలు తెలిపారు.

