వారిని కూడా విడిచిపెట్టని హ్యాకర్లు : రెడ్క్రాస్పై భారీ సైబర్ దాడి.. 5 లక్షల మంది వ్యక్తిగత డేటా లీక్..
యుద్ధ బాధితులకు(war victims) సహాయం చేసే రెడ్క్రాస్(red cross)పై భారీ సైబర్ దాడి జరిగింది. రెడ్క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ హ్యాకర్లు డేటాను హోస్ట్ చేసే సర్వర్లలోకి చొరబడి అర మిలియన్ కంటే ఎక్కువ మంది వ్యక్తిగత, గోప్యమైన సమాచారానికి అక్సెస్ పొందినట్లు తెలిపింది.
ఈ హ్యాక్ ద్వారా దాదాపు 5,15,000 మంది వ్యక్తుల వ్యక్తిగత, ముఖ్యమైన సమాచారం లికైనట్లు సమాచారం. హ్యాకర్లను ఇంకా గుర్తించాల్సి ఉందని జెనీవాకు చెందిన ఏజెన్సీ బుధవారం తెలిపింది. ఈ డేటా చోరీలో ఏదైనా విపత్తు లేదా ఏదైనా యుద్ధం కారణంగా వారి కుటుంబాల నుండి విడిపోయిన సుమారు 5,15,000 మంది వ్యక్తుల డేటా దొంగిలించబడింది. హ్యాకర్లు అక్సెస్ పొందిన డేటాలో 60 రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రెసెంట్ చాప్టర్ సెంటర్ల గురించిన సమాచారం ఉంది.
ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్క్రాస్ (ICRC) డైరెక్టర్ జనరల్ రాబర్ట్ మార్డిని ఒక ప్రకటనలో "ఇప్పటికే తప్పిపోయిన వారి డేటా దొంగిలించడం అనేది వారి కుటుంబ సభ్యుల బాధలను మరింత పెంచుతుంది. ఈ హ్యాక్ జరిగినందుకు అలాగే ఈ రకమైన సమాచారం కూడా దొంగిలించడంపై మేమంతా షాక్ అయ్యాము" అని అన్నారు
దొంగిలించబడిన డేటాను హ్యాకర్ బహిరంగపరిచారా లేదా అనేది ఇంకా తెలియనప్పటికీ, హ్యూమనిటీ సంస్థల కోసం డేటాను సేకరిస్తున్న స్విట్జర్లాండ్లోని థర్డ్ పార్టీ సంస్థను హ్యాకర్ లక్ష్యంగా చేసుకున్నట్లు ఐసిఆర్సి తెలిపింది. రెడ్క్రాస్పై ఇంతకుముందెన్నడూ ఇలాంటి సైబర్ దాడి జరగలేదని ఐసీఆర్సీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.