టీ20 వరల్డ్ కప్ 2026 అంబాసిడర్గా రోహిత్ శర్మ
Rohit Sharma : ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 కు టీమిండియా స్టార్ రోహిత్ శర్మను అంబాసిడర్గా నియమించారు. దీంతో భారత్, శ్రీలంకల్లో జరిగే ఈ టోర్నీలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారు.

రోహిత్ శర్మకు ఐసీసీ నుంచి కీలక బాధ్యత
భారత క్రికెట్లో హిట్మ్యాన్ గా పేరు పొందిన రోహిత్ శర్మ, తన అద్భుత బ్యాటింగ్ శైలి, తనదైన నాయకత్వం, అత్యున్నత స్థాయి మ్యాచ్ టెంపరమెంట్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అరుదైన ఆటగాడు. 2007 టీ20 వరల్డ్ కప్లో తొలి అడుగు నుంచి 2024లో భారత జట్టుకు టీ20 కప్ అందించిన కెప్టెన్గా మారే వరకు, రోహిత్ ప్రయాణం భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం.
రికార్డులు, ధైర్యమైన ఆరంభాలు, మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సామర్థ్యం.. ఇవి అన్నీ కలిపి రోహిత్ ను ఆధునిక క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్లలో ఒకరిగా నిలబెట్టాయి.
ఈ క్రమంలోనే మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్కు రోహిత్ శర్మను టోర్నమెంట్ అంబాసిడర్గా ఐసీసీ ప్రకటించింది. 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్ను భారత జట్టుకు అందించిన రోహిత్, మరోసారి ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్లో తనదైన పాత్ర పోషించనున్నాడు. భారత్, శ్రీలంకల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది.
టీ20ల్లో రోహిత్ రికార్డుల మోత
రోహిత్ శర్మ టీ20 అంతర్జాతీయ ఫార్మాట్లో భారత జట్టుకు అత్యంత విశ్వసనీయ బ్యాటర్గా నిలిచారు. ఈ ఫార్మాట్లో ఆయన 4,231 పరుగులు చేశారు. సగటు 32.01. స్ట్రైక్ రేట్ 140.89. టీ20ల్లో భారీ స్కోర్లు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఆయన రెండు టీ20 వరల్డ్ కప్ విజేత జట్లలో భాగంగా ఉన్నారు.
2007 నుండి 2024 వరకు రోహిత్ ప్రభావం
2007 టీ20 వరల్డ్ కప్ ఆయనకు ఫార్మాట్లో తొలి టోర్నమెంట్. అయితే తొలి సిరీస్ నుంచే రోహిత్ తన ప్రతిభను చూపించారు. ఆ టోర్నీలో ఆయన ఒక్కసారి కూడా ఔట్ కాకుండా 88 పరుగులు చేశారు. సూపర్ ఎయిట్స్లో దక్షిణాఫ్రికాపై కీలకమైన 50 రన్స్*, ఫైనల్లో పాకిస్థాన్పై 30 రన్స్* టీమ్కు చాలా సహాయపడ్డాయి.
2024 టోర్నమెంట్ మాత్రం ఆయన కెప్టెన్సీ ప్రత్యేక గుర్తింపు పొందిన సంవత్సరం. రోహిత్ అద్భుత నాయకత్వంతో భారత్కు 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ అందించాడు. ఆ టోర్నీలో ఆయన 257 పరుగులు చేశారు. స్ట్రైక్ రేట్ 156.70.
ఆస్ట్రేలియాపై సూపర్ ఎయిట్స్ మ్యాచ్లో 92 (41 బంతుల్లో), ఇంగ్లాండ్పై సెమీఫైనల్లో 57 (39 బంతుల్లో) కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. ఈ టోర్నమెంట్ గెలిచిన తర్వాత ఆయన టీ20 అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికారు.
అంబాసిడర్గా రోహిత్ స్పందన ఇదే
ఐసీసీ టోర్నమెంట్ అంబాసిడర్గా ఎంపికైన సందర్భంగా రోహిత్ శర్మ స్పందిస్తూ.. "ఈ టోర్నమెంట్ మళ్లీ భారత్లో జరగటం చాలా ఆనందంగా ఉంది. అంబాసిడర్గా వ్యవహరించడం ప్రత్యేక అనుభూతి. అన్ని జట్లకు నా శుభాకాంక్షలు. భారత ఆతిథ్యాన్ని ఆస్వాదించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.
రోహిత్ తన కొత్త పాత్రపై సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు.
టీ20 వరల్డ్ కప్ 2026 ఐసీసీ షెడ్యూల్
2026 ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక కలిసి నిర్వహించనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ టోర్నీలో మరిన్ని జట్లు పాల్గొనే అవకాశం ఉంది.
ఈసారి కొత్త గ్రౌండ్స్, విస్తృత షెడ్యూల్, అధునాతన టెక్నాలజీతో టోర్నీ నిర్వహణలో ఐసీసీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.

