ఆర్సీబీ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. చిన్నస్వామికి గుడ్బై ! కోహ్లీ కొత్త హోమ్ గ్రౌండ్ ఏది?
RCB : చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టీమ్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ 2026 సీజన్లో పుణే ఆర్సీబీ కొత్త హోమ్ గ్రౌండ్ గా మారే అవకాశముందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియానికి ఆర్సీబీ బై బై
2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకోవడం జట్టు అభిమానులకు చారిత్రాత్మక ఘట్టంగా నిలిచింది. కానీ ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. జూన్ 4న బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన విజయోత్సవ ర్యాలీ తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన కర్ణాటక ప్రభుత్వాన్ని కుదిపేసింది. వెంటనే విచారణ కమిషన్ నియమించి స్టేడియం భద్రతా లోపాలను పరిశీలించారు.
జాన్ మైఖేల్ డికున్హా నేతృత్వంలోని కమిషన్ నివేదికలో చిన్నస్వామి స్టేడియం పెద్ద మొత్తంలో జనసమూహంతో ఈవెంట్స్ నిర్వహించడానికి సురక్షితం కాదని తేల్చింది. దీంతో 2025 జూలైలో స్టేడియంలో అన్ని క్రీడా ఈవెంట్లు తాత్కాలికంగా నిలిపివేశారు.
కొత్త వేదిక కోసం చూస్తున్న ఆర్సీబీ
ఈ పరిస్థితుల్లో 2026 ఐపీఎల్ సీజన్కు ముందు ఆర్సీబీ యాజమాన్యం పెద్ద సవాల్ ఎదుర్కొంటోంది. తమ హోమ్ మ్యాచ్లు ఎక్కడ ఆడాలన్నదే ప్రధాన ప్రశ్నగా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఆర్సీబీ పుణే లోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (MCA) స్టేడియంను తాత్కాలిక హోమ్ గ్రౌండ్గా ఉపయోగించే దిశగా అడుగులు వేస్తోంది.
MCA కార్యదర్శి కమలేష్ పిసాల్ మాట్లాడుతూ, “పుణేలో ఆర్సీబీ మ్యాచ్లను నిర్వహించే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. చిన్నస్వామి ఘటన తర్వాత బెంగళూరులో పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. అందుకే పుణేను ప్రత్యామ్నాయ వేదికగా పరిగణిస్తున్నారు” అని తెలిపారు.
ఆర్సీబీ కోసం పుణే స్టేడియం సన్నాహాలు
2022 ఐపీఎల్ సీజన్లో పుణే స్టేడియం పలు మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చింది. 37,000 సీటింగ్ కెపాసిటీ కలిగిన ఈ స్టేడియం అత్యాధునిక సదుపాయాలతో ఉంది. బీసీసీఐ అనుమతిస్తే, 2026లో ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్లన్నింటిని ఇక్కడే ఆడే అవకాశం ఉంది.
పుణేలో ఆడటం వల్ల ఆర్సీబీ జట్టుకు ప్రయాణ పరిమితులు తగ్గుతాయి. కానీ బెంగళూరు అభిమానులకు మాత్రం ఇది చేదు వార్తే. “తమ జట్టు మ్యాచులను హోం గ్రౌండ్ చూడలేమా?” అని అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరులో కొత్త మెగా స్టేడియం నిర్మాణం
చిన్నస్వామి ఘటన తర్వాత కర్ణాటక ప్రభుత్వం బొమ్మసంద్రలోని సూర్య సిటీలో రూ.1,650 కోట్లతో మెగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ స్టేడియం 80,000 సీటింగ్ కెపాసిటీతో దేశంలో రెండో అతిపెద్ద క్రికెట్ వేదికగా నిలవనుంది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం తర్వాత ఇది భారత్లోనే అతిపెద్ద క్రికెట్ వేదికగా మారబోతోంది. ఈ స్టేడియం పూర్తయిన తర్వాత, బెంగళూరులో మళ్లీ ఆర్సీబీ తమ హోమ్ మ్యాచ్లను ఆడే అవకాశం ఉంటుంది.
ఆర్సీబీ అభిమానుల్లో నిరాశ
17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న ఆనందం క్షణాల్లో మాయమైపోయింది. ఆర్సీబీ అభిమానులు చిన్నస్వామి స్టేడియంతో ఉన్న బంధం మరిచిపోలేనిదే. ఇప్పుడు ఆ వేదికను విడిచి పుణేలో ఆడాల్సిన పరిస్థితి వారికి నిరాశ కలిగిస్తోంది.
అయితే పుణేలో కొత్త వాతావరణం, కొత్త ప్రేక్షకుల మద్దతుతో ఆర్సీబీ మరోసారి అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలనే ప్లాన్స్ లో ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.