- Home
- Sports
- Rajasthan Royals : షేన్ వార్న్ కుటుంబానికి రూ. 450 కోట్లు.. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు లెక్క ఇదే !
Rajasthan Royals : షేన్ వార్న్ కుటుంబానికి రూ. 450 కోట్లు.. ఈ మాస్టర్ ప్లాన్ వెనుక అసలు లెక్క ఇదే !
Rajasthan Royals Sale : ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ భారీ ధరకు విక్రయం జరిగింది. అయితే, 18 ఏళ్ల క్రితం షేన్ వార్న్ చేసుకున్న ఒప్పందం కారణంగా ఆయన కుటుంబానికి ఏకంగా రూ. 450 కోట్లు అందనున్నాయి. ఈ జాక్ పాట్ కథేంటో ఇక్కడ తెలుసుకుందాం.

షేన్ వార్న్ మాస్టర్ మైండ్: 18 ఏళ్ల క్రితం వేసిన ప్లాన్తో ఇప్పుడు రూ. 450 కోట్లు!
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో క్రికెట్ మైదానంలో ఆట కంటే కూడా తెరవెనుక జరుగుతున్న వ్యాపార లావాదేవీలు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), రాజస్థాన్ రాయల్స్ (RR) వంటి దిగ్గజ ఫ్రాంచైజీల విక్రయ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇందులో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్, దివంగత షేన్ వార్న్ కుటుంబానికి ఏకంగా రూ. 450 కోట్ల రూపాయలు అందనున్నాయన్న వార్త. ఒక ఆటగాడిగా కాకుండా, ఒక దూరదృష్టి గల వ్యాపారవేత్తగా వార్న్ 2008లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అతని కుటుంబానికి భారీ సంపదను తెచ్చిపెడుతోంది.
ఆర్ఆర్ ను అమ్మింతే వార్న్ కుటుంబానికి ఎందుకు లాభం?
2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొదటి సీజన్ ప్రారంభమైనప్పుడు, రాజస్థాన్ రాయల్స్ జట్టు షేన్ వార్న్ను కెప్టెన్గా ఎంపిక చేసుకుంది. ఆ సమయంలో వార్న్ ఫ్రాంచైజీ ముందు ఒక వినూత్నమైన షరతు పెట్టారు. అప్పట్లో ఐపీఎల్ సక్సెస్ అవుతుందో లేదో ఎవరికీ తెలియదు. కానీ వార్న్ మాత్రం తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, తన జీతంతో పాటు జట్టులో వాటాను కోరారు. ఫిబ్రవరి 24న రాజస్థాన్ రాయల్స్ జట్టును కాల్ సోమనీకి చెందిన అమెరికా గ్రూప్ 1.63 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15,290 కోట్లు) కొనుగోలు చేసింది. ఈ భారీ డీల్ కారణంగా 18 ఏళ్ల క్రితం వార్న్ చేసుకున్న ఒప్పందం ఇప్పుడు అమల్లోకి వచ్చింది.
కెప్టెన్ మాత్రమే కాదు.. అంతకు మించి!
2008లో రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ వార్న్ను కేవలం ఒక ఆటగాడిగా చూడలేదు. వారికి అప్పట్లో అనుభవజ్ఞులైన కోచ్లు లేదా గైడ్లు లేరు. దీంతో వార్న్కు కెప్టెన్సీతో పాటు కోచ్ బాధ్యతలను, జట్టు ఎంపికలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఆ సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం, వార్న్ ఆడే ప్రతి ఏడాదికి గానూ జట్టులో 0.75 శాతం యాజమాన్య వాటాను ఇవ్వాలని నిర్ణయించారు. దీని గురించి గతంలో వార్న్ మాట్లాడుతూ, "నేను కేవలం కెప్టెన్ను మాత్రమే కాదు, జట్టుకు సంబంధించి సర్వం నేనే అయి వ్యవహరించాలని వారు కోరారు. అందుకే నా ఒప్పందంలో వాటాను భాగం చేశాను" అని వెల్లడించారు.
వార్న్ రూ. 450 కోట్ల లెక్క ఇదీ !
షేన్ వార్న్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో మొత్తం నాలుగు సీజన్ల పాటు కొనసాగారు. 2008లో అండర్ డాగ్స్గా బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టును అద్భుత నాయకత్వంతో తొలి ఐపీఎల్ విజేతగా నిలిపారు. అలా నాలుగు ఏళ్ల కాలంలో ఆయన వాటా మొత్తం 3 శాతానికి చేరుకుంది. ఇప్పుడు ఫ్రాంచైజీ విలువ 1.63 బిలియన్ డాలర్లుగా నిర్ణయించబడటంతో, వార్న్ కు ఉన్న 3 శాతం వాటా విలువ భారత కరెన్సీలో సుమారు రూ. 450 నుంచి 460 కోట్ల మధ్యలో ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి. ఆ రోజుల్లో వార్న్ సీజన్కు రూ. 2.34 కోట్లు జీతం తీసుకునేవారు, కానీ ఆయన వాటా రూపంలో సంపాదించిన ఆస్తి ఇప్పుడు కోట్లకు చేరింది.
వార్న్ దూరదృష్టికి ఇది నిదర్శనం
సాధారణంగా ఆటగాళ్లు తమ కెరీర్ ముగిసే వరకు కేవలం మ్యాచ్ ఫీజులు, ఎండార్స్మెంట్లపైనే దృష్టి పెడతారు. కానీ షేన్ వార్న్ ఐపీఎల్ ప్రారంభ దశలోనే ఈ లీగ్ సృష్టించబోయే సంపదను ముందే ఊహించారు. 2022లో ఆయన మరణించినప్పటికీ, ఆయన చేసిన ఆ ఒప్పందం నేడు ఆయన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసానిస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ఒక ఆటగాడు తన ఆటతోనే కాకుండా, తన తెలివితేటలతో ఇంతటి భారీ మొత్తాన్ని ఆర్జించడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ విక్రయం ఇప్పుడు స్పోర్ట్స్ బిజినెస్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది.

