మహిళల వరల్డ్ కప్ 2025: టీమిండియా ఎంత ప్రైజ్ మనీ గెలుచుకుందో తెలుసా? షాక్ అవుతారు !
World Cup Prize Money: మహిళల వరల్డ్ కప్ 2025 ఛాంపియన్ గా భారత జట్టు నిలిచింది. ఫైనల్ లో సౌతాఫ్రికా పై 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. రికార్డు ప్రైజ్ మనీ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు
ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియంలో నవంబర్ 2న జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, మొదటిసారిగా ప్రపంచ కప్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత మహిళల క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది.
𝐂.𝐇.𝐀.𝐌.𝐏.𝐈.𝐎.𝐍.𝐒 🏆
Congratulations to #TeamIndia on winning their maiden ICC Women's Cricket World Cup 🇮🇳
Take. A. Bow 🙌#WomenInBlue | #CWC25 | #Final | #INDvSApic.twitter.com/rYIFjasxmc— BCCI Women (@BCCIWomen) November 2, 2025
మహిళల ప్రపంచ కప్ 2025 : ఐసీసీ ప్రైజ్ మనీ వివరాలు
భారత జట్టు ఛాంపియన్ గా నిలిచిన తర్వాత భారీ ప్రైజ్ మనీ అందుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఈసారి రికార్డు స్థాయి బహుమతి మొత్తం ప్రకటించింది. మొత్తం USD 13.88 మిలియన్ (సుమారు రూ.122.5 కోట్లు) ప్రైజ్ పూల్గా నిర్ణయించారు. ఇది గత ఎడిషన్ కంటే మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం.
• విజేతలకు (భారత జట్టు): USD 4.48 మిలియన్ (రూ.39.55 కోట్లు)
• రన్నరప్ (దక్షిణాఫ్రికా): USD 2.24 మిలియన్ (రూ.19.77 కోట్లు)
• సెమీఫైనల్లో ఓడిన జట్లకు: ఒక్కో జట్టుకు USD 1.12 మిలియన్ (రూ.9.89 కోట్లు)
• గ్రూప్ స్టేజ్ గెలుపు బోనస్: ఒక్క విజయానికి USD 34,314 (రూ.30.29 లక్షలు)
• పాల్గొన్నందుకు ఫీజు: ఒక్కో జట్టుకు USD 250,000 (రూ.2.20 కోట్లు)
బహుమతి మొత్తంలో 239% పెరుగుదల చోటుచేసుకుంది. ఈ పెరుగుదల మహిళల క్రికెట్ అభివృద్ధిపై ఐసీసీ దృష్టిని ప్రతిబింబిస్తుంది.
భారత్ గెలుచుకున్న మొత్తం ప్రైజ్ మనీ ఎంత?
భారత మహిళల జట్టు గ్రూప్ స్టేజ్లో మూడు మ్యాచ్లు గెలిచింది. ఈ విజయాలకు రూ.90.87 లక్షలు గెలుచుకుంది. అలాగే, టోర్నీలో పాల్గొనందుకు ఫీజుగా రూ.2.20 కోట్లు లభించాయి. ఫైనల్లో విజేతలుగా నిలిచినందుకు ప్రధాన బహుమతిగా రూ.39.55 కోట్లు అందుకుంది.
మొత్తం కలిపి, హర్మన్ప్రీత్ కౌర్ జట్టు రూ.42.66 కోట్లు ఐసీసీ నుండి పొందింది. అదనంగా, బీసీసీఐ ప్రత్యేక బహుమతిగా రూ.125 కోట్లు ప్రకటించనుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో భారత్ గెలుచుకున్న మొత్తం బహుమతి రూ.167.66 కోట్లకు చేరింది.
మహిళా ప్రపంచ కప్ 2025: ఫైనల్ మ్యాచ్ అవార్డులు
దక్షిణాఫ్రికాపై ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ విజయాన్ని అందుకుంది.
• ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ (Player of the Match): షెఫాలి వర్మ (87 పరుగులు, 2 వికెట్లు)
• ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ (Player of the Tournament): దీప్తి శర్మ (22 వికెట్లు, 215 పరుగులు)
ఫైనల్ మ్యాచ్ లో షెఫాలి బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ కీలక పాత్ర పోషించింది. దీప్తి శర్మ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసి భారత జట్టు ఛాంపియన్ గా నిలవడంతో కీలక పాత్ర పోషించింది.
భారత మహిళల జట్టుకు బీసీసీఐ ప్రత్యేక బహుమతి
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించిన ప్రకారం, మహిళల జట్టుకు రూ.51 కోట్ల ప్రత్యేక బహుమతి ఇవ్వనున్నారు. అయితే, గతంలో రోహిత్ సేనకు అందించిన 120 కోట్ల బహుమతి ఉంటుందని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ఇది ఐసీసీ బహుమతికి అదనంగా లభించనుంది.
చరిత్రలో నిలిచిన ఘనత
ఇది భారత మహిళల జట్టుకు వరల్డ్ కప్ ఫైనల్లో మూడో ప్రయత్నం. మూడోసారి భారత జట్టును అదృష్టం వరించింది. హర్మన్ప్రీత్ కౌర్ ఇప్పుడు లెజెండరీ ప్లేయర్లు కపిల్ దేవ్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల సరసన నిలిచింది. వీరు భారత్ కు ఐసీసీ ట్రోఫీలు గెలిపించారు. భారత్ మహిళల విజయం కేవలం క్రికెట్ విజయమే కాదు, మహిళా క్రీడాకారిణుల సమాన ప్రాధాన్యతకు నిదర్శనం కూడా. ఈ విజయం భారత క్రీడా చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోనుంది.