ఆ ముగ్గురికి అర్హత లేదు.. కట్ చేస్తే.. గంభీర్ చొరవతో వన్డే జట్టులోకి.. వారెవరంటే.?
India Vs NZ: న్యూజిలాండ్తో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేయడంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

మూడు వన్డేల సిరీస్..
న్యూజిలాండ్తో మరో రెండు రోజుల్లో జరగనున్న మూడు వన్డేల సిరీస్కు భారత జట్టును జనవరి 3న సెలెక్టర్లు ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించిన ఈ జట్టుకు శుభ్మాన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. అయితే బీసీసీఐ మెడికల్ టీం నుంచి అతనికి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. వైద్య బృందం అనుమతిస్తేనే అతను గ్రౌండ్లోకి అడుగు పెడతాడని తెలుస్తోంది.
ముగ్గురి ఆటగాళ్లపై విమర్శలు..
ఈ జట్టు ఎంపికపై ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది, ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్ళ ఎంపికపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీరి ప్రదర్శనలు అంతంతమాత్రంగానే ఉన్నా, కోచ్ గౌతమ్ గంభీర్ చొరవతోనే వారికి చోటు దక్కిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ముగ్గురు ఆటగాళ్ళు రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ.
రిషబ్ పంత్ ఆటతీరు..
లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను సెలెక్టర్లు వన్డే జట్టులోకి తీసుకున్నారు. అయితే, 2025లో పంత్కు ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఏడాది పొడవునా అతను బెంచ్కే పరిమితమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా పంత్ పెద్దగా రాణించలేదు. ఐదు మ్యాచుల్లో కేవలం రెండు హాఫ్ సెంచరీలతో 188 పరుగులు మాత్రమే చేశాడు. అదే సమయంలో, విజయ్ హజారే ట్రోఫీలో ధృవ్ జురేల్ 379 పరుగులు, ఇషాన్ కిషన్ రెండు మ్యాచుల్లో ఒక సెంచరీతో 146 పరుగులతో అద్భుతంగా రాణించినప్పటికీ, బీసీసీఐ వారిని విస్మరించింది.
నితీష్ పేలవ ప్రదర్శన..
యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా జట్టులో చోటు దక్కింది. కానీ ఇతని గత గణాంకాలు పేలవం గానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడిన రెండు వన్డేల్లో నితీష్ కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు. అతడి ఎకానమీ రేటు 7.74గా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీలో కూడా ఐదు మ్యాచుల్లో ఒకే ఒక్క అర్ధ సెంచరీ, ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. అయినప్పటికీ సెలెక్టర్లు ఇతనికి వన్డే క్యాప్ ఇచ్చేందుకు మొగ్గు చూపారు.
ప్రసిద్ద్ కృష్ణ గణాంకాలు..
ఇక ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ విషయానికొస్తే, ఇతనిపై కోచ్ గంభీర్ ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు కనిపిస్తోంది. ప్రసిద్ధ్ ఇప్పటివరకు 21 వన్డేల్లో 37 వికెట్లు తీశాడు. ఇతని ఎకానమీ రేటు 6.02గా ఉంది. విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక తరఫున కేవలం రెండు మ్యాచ్లు ఆడి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. మరోవైపు, ఇదే టోర్నమెంట్లో ఐదు మ్యాచ్ల్లో 11 వికెట్లు తీసి అద్భుతమైన ఫామ్లో ఉన్న మహమ్మద్ షమీని సెలెక్టర్లు పక్కనపెట్టి ప్రసిద్ధ్ కృష్ణను ఎంచుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

