గంభీర్ మాస్టర్ ప్లాన్ ఇదా.? ఇక టీమిండియా ఊపిరి పీల్చుకో.!
Gambhir: యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు వరుస అవకాశాలు ఇవ్వడంపై విమర్శలు వచ్చినా.. రాంచీ వన్డేలో మూడు కీలక వికెట్లు తీసి ప్రశంసలు అందుకున్నాడు. మరి అసలు హర్షిత్ రాణాకు అవకాశాలు ఇవ్వడంపై వివరాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

అతడిపైనే నమ్మకం.. అవకాశాలు..
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల యువ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణాకు పదేపదే అవకాశాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజులుగా హర్షిత్ రాణాపై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే, టీ20 సిరీస్లకు ఎంపికైన హర్షిత్.. ఇటీవల సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత తుది జట్టులో స్థానం సంపాదించాడు. జట్టులో ఎంపిక కావడం తన తప్పు కానప్పటికీ, రాణాపై ఈ స్థాయిలో విమర్శలు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
తొలి వన్డేలో అద్భుత ప్రదర్శన
అయితే, ఈ విమర్శలకు సమాధానమిస్తూ, రాంచీలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా పేసర్ హర్షిత్ రాణా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై మూడు కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనతో రాణాపై ప్రశంసలు వెల్లువెత్తాయి. హర్షిత్ రాణా సూపర్ బౌలింగ్ తర్వాత ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ గతంలో చేసిన వ్యాఖ్యలు మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వారికి తగినంత సమయం ఇవ్వాలి..
సందీప్ శర్మ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. ఒకరి ప్రతిభను గుర్తించినప్పుడు, వారు పరిణతి సాధించడానికి తగినంత సమయం ఇవ్వడానికే ప్రయత్నిస్తారని పేర్కొన్నాడు. హర్షిత్ రాణా విషయంలోనూ అదే జరిగిందని, గంభీర్ రాణాను నమ్మాడని, అందుకే అతనికి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నట్టుగా సందీప్ శర్మ వివరించాడు. హర్షిత్ రాణా 140 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేయగలడని, అతని ఎత్తు, శారీరక దృఢత్వం అదనపు బలం అని అతడు పేర్కొన్నాడు.
నమ్మి అవకాశాలు ఇస్తే..
అలాంటి ఐదుగురు ఆటగాళ్లను నమ్మి అవకాశాలు ఇచ్చినప్పుడు, వారిలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే బాగా రాణించగలరని, మూడు లేదా నాలుగుసార్లు అంచనా తప్పు కావచ్చని సందీప్ శర్మ వాదించాడు. అందుకే ఫాస్ట్ బౌలర్లను కనుగొని, వారిని మెరుగుపరచాల్సిన అవసరం సెలెక్టర్లకు ఉందని అతడు నొక్కిచెప్పాడు. రాణా వయసు ప్రస్తుతం 23 సంవత్సరాలు. కాబట్టి అతని ఎదుగుదలకు అవకాశాలు ఇవ్వాలని సందీప్ శర్మ స్పష్టం చేశాడు.
మూడు ఫార్మాట్లలో కీలక ప్లేయర్..
గత ఏడాది కాలంగా హర్షిత్ రాణా టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలో స్క్వాడ్లో ఎంపిక అవుతున్నప్పటికీ, ప్లేయింగ్ ఎలెవన్లో స్థానం సంపాదించుకోలేకపోతున్నాడు. రాణాకు వరుస అవకాశాలు ఇవ్వడం కొంతమందికి నచ్చకపోవడంతో ట్రోలింగ్ జరిగింది. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్, ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ మెంటర్గా కూడా వ్యవహరించాడు. హర్షిత్ రాణా కేకేఆర్ జట్టు తరఫున ఆడిన విషయం తెలిసిందే. కేకేఆర్తో ఉన్న అనుబంధం కారణంగానే గంభీర్ రాణాకు వరుస అవకాశాలు ఇస్తున్నాడని నెటిజన్లు భావిస్తున్నట్టు తెలిపారు.

