ఐపీఎల్ కు ఆర్సీబీ మాజీ స్టార్ ప్లేయర్ వీడ్కోలు.. పాకిస్తానే కారణం
Faf du Plessis: ఐపీఎల్లో 14 సీజన్ల ప్రయాణం తరువాత ఫాఫ్ డు ప్లెసిస్ వీడ్కోలు పలికాడు. 2026 సీజన్ లో తాను ఆడటం లేదని తెలిపాడు. దీనికి పాకిస్తానే కారణమని క్రికెట్ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఆ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్కు ఫాఫ్ డు ప్లెసిస్ గుడ్ బై
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, ఆర్సీబీ మాజీ స్టార్ ఫాఫ్ డు ప్లెసిస్ తన 14 ఏళ్ల ఐపీఎల్ ప్రయాణానికి వీడ్కోలు పలికాడు. అతను తీసుకున్న తాజా నిర్ణయంతో క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. సూపర్ కింగ్స్, పూణే, ఆర్సీబీ, ఢిల్లీ వంటి నాలుగు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ స్టార్ బ్యాట్స్మన్ రాబోయే ఐపీఎల్ 2026 వేలానికి తన పేరును నమోదు చేసుకోవడం లేదని అధికారికంగా వెల్లడించాడు.
డిసెంబర్ 15న జరగనున్న వేలానికి కేవలం రెండు వారాల ముందు తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్ గు గురిచేసింది. అయితే ఇది రిటైర్మెంట్ కాదనీ, కేవలం ఒక బ్రేక్ మాత్రమే అని డు ప్లెసిస్ వెల్లడించడం గమనార్హం.
పీఎస్ఎల్ వైపు ఫాఫ్ డు ప్లెసిస్ అడుగులు
ఫాఫ్ డు ప్లెసిస్ పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL)లో ఆడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. “కొత్త దేశం, కొత్త వాతావరణం, కొత్త సవాలు… ఆటగాడిగా ఎదగడానికి ఇది సరైన సమయం” అని తన పోస్ట్లో పేర్కొన్నారు.
పీసీఎల్ లో పాల్గొనడం ద్వారా తన ఆటకు కొత్త శక్తిని తీసుకురావాలని చూస్తున్నట్టు స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా టీ20 ఫ్రాంచైజీ లీగ్లలో తాను అధికంగా పాల్గొంటున్నందున, ఈ కొత్త అనుభవం తన కెరీర్కు మరో అధ్యాయంగా మారుతుందని అభిప్రాయం వ్యక్తంచేశాడు.
ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్ ప్రయాణం ఇదే
2012లో ఐపీఎల్లో అడుగుపెట్టిన ఫాఫ్ డు ప్లెసిస్, చెన్నై సూపర్ కింగ్స్తో తన గోల్డెన్ చాప్టర్ను ప్రారంభించాడు. 7 సీజన్లు సీఎస్కేకే, 3 సీజన్లు ఆర్సీబీ కెప్టెన్సీ, ఢిల్లీ క్యాపిటల్స్తో 2025 సీజన్.. ఇలా ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన ప్రయాణం సాగించాడు.
ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్ కెరీర్ గణాంకాలు ఇలా ఉన్నాయి..
• మ్యాచ్లు: 154
• పరుగులు: 4,773
• బ్యాటింగ్ సగటు: 35.09
• స్ట్రైక్ రేట్: 135.78
• హాఫ్ సెంచరీలు సెంచరీలు: 39
2023 సీజన్లో 14 మ్యాచ్ల్లో చేసిన 730 పరుగులు అతనిని ఆర్సీబీ అత్యుత్తమ కెప్టెన్ల సరసన నిలబెట్టాయి. 2021లో సీఎస్కే టైటిల్ గెలుపులో చేసిన 633 పరుగులు ఇప్పటికీ చెన్నై అభిమానులకు ప్రత్యేక గుర్తుగా నిలిచాయి.
ఇది నా వీడ్కోలు కాదు ! : ఫాఫ్ డు ప్లెసిస్
తనకు సపోర్టుగా నిలిచిన కోచ్లు, సహచరులు, అభిమానులకు ఫాప్ డు ప్లెసిస్ కృతజ్ఞతలు తెలిపాడు. “భారతదేశం నాకు ఎంతో ఇచ్చింది… ఇది నా ప్రయాణానికి ముగింపు కాదు. మళ్లీ మీ ముందుకు వస్తాను” అని పేర్కొన్నాడు.
ఐపీఎల్, పీఎస్ఎల్ రెండింటినీ సమానంగా ప్రేమించే అభిమానులు ఇప్పుడు అతని కొత్త అధ్యాయం ఎలా ఉంటుందో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

