ఇదెక్కడి హిట్టింగ్ సామీ.. 9 బంతుల్లో 8 సిక్సర్లు.. యువరాజ్ సింగ్ రికార్డ్ బ్రేక్
Dipendra Singh Airee: నేపాల్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ కేవలం 9 బంతుల్లో 50 పరుగులు చేసి యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ చరిత్రాత్మక ఘనత హాంగ్జౌలో నమోదైంది.

9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.. యువరాజ్ రికార్డ్ బద్దలు
క్రికెట్ ప్రపంచంలో రికార్డులు ఎప్పుడు నిలకడగా ఉండవు. ఒకరోజు నమోదైతే, మరుసటి రోజు వాటిని కొత్త రికార్డులు బద్దలు కొడతాయి. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సృష్టించిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ విషయంలో కూడా అదే జరిగింది. భారత క్రికెట్ దిగ్గజం 2007లో 12 బంతుల్లో 50 పరుగులు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కానీ ఇప్పుడు ఆ రికార్డు నేపాల్ యంగ్ క్రికెటర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ బద్దలు కొట్టాడు. కేవలం 9 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు.
ఆసియా గేమ్స్ చరిత్ర సృష్టించిన నేపాల్ ప్లేయర్
చైనాలోని హాంగ్జౌలో జరిగిన ఆసియా గేమ్స్ 2023లో నేపాల్ ప్లేయర్ దీపేంద్ర సింగ్ ఎయిరీ తన బ్యాట్ తో విధ్వంసం రేపాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్లో చారిత్రాత్మక ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ లో మంగోలియా టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. కానీ ఆ నిర్ణయం మంగోలియా జట్టుకు భయంకరంగా మారింది. నేపాల్ బ్యాటర్లు పిడుగుల్లా ఆడుతూ పరుగుల వరద పారించారు.
9 బంతుల్లో 50 పరుగులు: దీపేంద్ర సింగ్ ఎయిరీ బ్యాటింగ్ తుఫాన్
నేపాల్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో బ్యాటింగ్కు వచ్చిన దీపేంద్ర సింగ్ ఎయిరీ కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అతను తన ఇన్నింగ్స్ను వరుస సిక్సర్లతో ఆరంభించాడు. మొత్తం 10 బంతులు ఎదుర్కొని 8 సిక్సర్ల సాయంతో 52 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తన తుఫాను నాక్ తో యువరాజ్ సింగ్ 2007లో చేసిన 12 బంతుల హాఫ్ సెంచరీ రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచ క్రికెట్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టిన ప్లేయర్ గా ఘనత సాధించాడు.
యువరాజ్ సింగ్ చరిత్రాత్మక ఇన్నింగ్స్
2007 టీ20 వరల్డ్కప్లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్ ను యువరాజ్ సింగ్ దంచికొట్టాడు. ఆరు వరుస సిక్సర్లు కొట్టి యువీ ప్రపంచ క్రికెట్లో ఒక లెజెండరీ రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్ దక్షిణాఫ్రికాలోని డర్బన్ కింగ్స్మీడ్ మైదానంలో జరిగింది. ఆ ఇన్నింగ్స్లో ఆయన 12 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్రపంచంలో మొదటి సారిగా ఆ రికార్డు నమోదు చేశాడు. అదే ఘనత ఇప్పుడు నేపాల్ ప్లేయర్ బద్దలు కొట్టాడు.
ఇదే మ్యాచ్ లో కుశాల్ మల్లా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు నమోదు
ఈ మ్యాచ్లో మరో చరిత్ర సృష్టించిన ఆటగాడు కుశాల్ మల్లా. అతను కేవలం 34 బంతుల్లోనే సెంచరీ సాధించి T20 ఇంటర్నేషనల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు నమోదు చేశాడు. తన ఇన్నింగ్స్లో 12 సిక్సర్లు, 8 ఫోర్లు కొట్టి మొత్తం 137 పరుగులతో అజేయంగా నిలిచాడు.
నేపాల్ టీమ్ చరిత్రలో అతిపెద్ద స్కోరు
దీపేంద్ర సింగ్ ఎయిరీ, కుశాల్ మల్లా ఆడిన ఈ తుఫాన్ ఇన్నింగ్స్లతో నేపాల్ జట్టు టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలోనే అత్యధిక టీమ్ స్కోరు సృష్టించింది. నేపాల్ 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో మొదటిసారిగా 300 పరుగుల మార్క్ దాటిన ఇన్నింగ్స్గా నిలిచింది. మంగోలియాపై నేపాల్ 273 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది.
నేపాల్కు చారిత్రాత్మక రోజు
ఈ విజయంతో నేపాల్ క్రికెట్ కొత్త యుగంలోకి అడుగుపెట్టింది. ఇది కేవలం విజయం మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్లో తమ స్థానాన్ని తెలియజేసిన ఘట్టంగా నిలిచింది. యువరాజ్ సింగ్ రికార్డును బద్దలు కొట్టిన దీపేంద్ర సింగ్ ఎయిరీ పేరు క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. అయితే, కుశాల్ మల్లా తుఫాను నాక్ రికార్డుల మోత మోగించింది.