ఇది కదా కిర్రాకెక్కించే వార్త.. బెంగళూరులోనే RCB మ్యాచ్లు.. ఇక గ్రౌండ్ దద్దరిల్లాల్సిందే
RCB: చిన్నస్వామి స్టేడియంలో భద్రతా సమస్యల కారణంగా ఐపీఎల్ 2026 సీజన్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హోమ్ గ్రౌండ్ను మార్చనున్నారనే ఊహాగానాలు నెలకొన్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

హోం గ్రౌండ్ విషయంలో మార్పు..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2026 సీజన్కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తమ హోమ్ గ్రౌండ్ను మార్చనుందనే ఊహాగానాలు చెలరేగాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన దురదృష్టకర సంఘటన నేపథ్యంలో ఈ చర్చలు హాట్ టాపిక్గా మారాయి. ఐపీఎల్ 2025 టైటిల్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుచుకున్న తర్వాత నిర్వహించిన విజయోత్సవ వేడుకల సందర్భంగా తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్టేడియం భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది.
డబ్ల్యూపీఎల్ కూడా క్యాన్సిల్..
ఈ భద్రతా సమస్యల ప్రభావం ఇతర టోర్నమెంట్లపై కూడా పడింది. బెంగళూరులో జరగాల్సిన 2025 మహిళల వన్డే ప్రపంచ కప్లోని ఐదు మ్యాచ్లను ఇతర మైదానాలకు మార్చారు. అలాగే, ఆగస్టులో జరగాల్సిన మహారాజా టీ20 టోర్నమెంట్ను నిర్వహించే హక్కును కూడా చిన్నస్వామి స్టేడియం కోల్పోయింది. అంతేకాకుండా, 2026లో జరగబోయే మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మ్యాచ్లు కూడా చిన్నస్వామి స్టేడియంలో జరగవని ప్రకటించారు.
చిన్నస్వామి నుంచి దూరం..
డబ్ల్యూపీఎల్ మ్యాచ్లను నవీ ముంబైలోని డాక్టర్ డీవై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, వడోదరలోని కోటంబ స్టేడియంలో నిర్వహించనున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఐపీఎల్ 2026 సీజన్కు ముందు ఆర్సీబీ మ్యాచ్లను కూడా చిన్నస్వామి నుండి తరలించవచ్చని విస్తృతంగా ఊహాగానాలు వినిపించాయి. అయితే, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆర్సీబీ అభిమానులకు శుభవార్త చెప్పారు.
ఇది బెంగళూరు.. కర్ణాటక గౌరవం..
ఐపీఎల్ మ్యాచ్లను చిన్నస్వామి స్టేడియం నుంచి మరెక్కడికీ మార్చబోమని ఆయన స్పష్టం చేశారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ, "ఇది బెంగళూరు, కర్ణాటక గౌరవానికి సంబంధించిన విషయం. ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడే జరిగేలా చూస్తామని" అన్నారు. తన ఎక్స్ ఖాతా ద్వారా కూడా ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.
చిన్నస్వామి స్టేడియంలోనే RCB మ్యాచ్లు..
"చిన్నస్వామి స్టేడియం నుంచి ఐపీఎల్ మ్యాచ్లను మరెక్కడికీ మార్చడానికి మేము అనుమతించం. ఐపీఎల్ మ్యాచ్లు ఇక్కడే జరిగేలా మేము కచ్చితంగా చూస్తాం. నేను క్రికెట్ అభిమానిని. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా, స్టేడియం గౌరవం చెక్కుచెదరకుండా మేము చర్యలు తీసుకుంటాం," అని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా కొత్త క్రికెట్ స్టేడియాన్ని కూడా నిర్మిస్తామని డీకే శివకుమార్ వెల్లడించారు.

