మేనబావతో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని, భర్తను హత్య చేయించి, యాక్సిడెంట్ గా...
మేనబావతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ భార్య.. భర్త గొడవపెడుతున్నాడని పథకం ప్రకారం హత్య చేయించింది. యాక్సిడెంట్ గా చిత్రీకరించాలని చూసింది.

కర్ణాటక : భార్య వివాహేతర సంబంధం నేపథ్యంలో అకాల మృత్యువాత పడ్డాడు ఓ జానపద కళాకారుడు. తాళి కట్టిన భార్యే ఆయన పాలిట మృత్యు దేవతగా మారింది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. ఈ ఘటన సోమవారం రాత్రి కర్ణాటకలో వెలుగు చూసింది. ఇక్కడి జన్నగట్ట గ్రామ నివాసి జన్నగట్ట కృష్ణమూర్తి (50) జానపద కళాకారుడు. అతని భార్య శ్రీధర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి.. ప్రియుడు, మరో వ్యక్తితో కలిసి హత్య చేయించింది.
దీనికి సంబంధించిన కేసు నమోదు కావడంతో కోలారు రూరల్ పోలీసులు.. కృష్ణమూర్తి భార్య సౌమ్య, ప్రియుడు శ్రీధర్.. వారికి సహకరించిన మరో వ్యక్తి.. అతని పేరు కూడా శ్రీధరే.. ముగ్గురిని అరెస్టు చేశారు. మొదట జొన్నగట్ట రైల్వే బ్రిడ్జి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో టూవీలర్ మీద వెడుతున్న జొన్నగట్ట కృష్ణమూర్తి అనే జానపద కళాకారుడు మృతి చెందినట్లుగా వార్తలు వచ్చాయి.
ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులకు.. కృష్ణమూర్తి తలకు తీవ్ర గాయాలు ఉండడంతో అనుమానాలు వచ్చాయి. ఆ తర్వాత పోలీసులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా విచారించగా…భార్య సౌమ్య.. ప్రియుడితో కలిసి హత్య చేయించిన విషయం వెలుగు చూసింది. గత కొన్నేళ్లుగా జొన్నగట్ట కృష్ణమూర్తి కుటుంబంలో కలహాలు ఉన్నట్లుగా తెలిసింది. ఆయన భార్య సౌమ్యకు మేనమామ కొడుకుతో వివాహేతర సంబంధం ఉంది.
ఈ విషయం భర్తకు తెలియడంతో వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగేవి.దీనిమీద పలుమార్లు పెద్దల పంచాయతీ కూడా జరిగింది. అయినా కూడా భార్యాభర్తల మధ్య గొడవలు సద్దుమనగలేదు. దీంతో, ఎప్పటికైనా భర్త తమ సంబంధానికి అడ్డుగా ఉంటాడని భావించిన సౌమ్య.. మేనబావతో కలిసి.. మరో వ్యక్తి సహాయంతో అతడిని హత్య చేయించింది. దీనికోసం ముందుగానే పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
దీంట్లో భాగంగానే సోమవారం రాత్రి 8 గంటల సమయంలో.. టూ వీలర్ మీద జొన్నగట్ట రైల్వే బ్రిడ్జి దగ్గర నుంచి వస్తున్న కృష్ణమూర్తిని ప్రియుడి స్నేహితుడు శ్రీధర్ లిఫ్ట్ అడిగే నెపంతో ఆపాడు. అతడు బండి ఆపగానే శ్రీధర్ తో పాటు మేనమామ కొడుకు అయిన మరో శ్రీధర్ కూడా కలిసి కృష్ణమూర్తి మీద ఇనుపరాడితో దాడి చేశారు. దీంతో అతడు తల వెనుక భాగాన గాయాలయ్యాయి. గాయాల కారణంగా తీవ్ర రక్తస్రావం కావడంతో కృష్ణమూర్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆ తర్వాత భార్య సౌమ్య దీన్ని యాక్సిడెంట్ గా నమ్మించడానికి ప్రయత్నించింది. కానీ పోలీసులకు మృతుడి తల వెనుక ఉన్న గాయాలు అనుమానం రేకెత్తించడంతో అసలు విషయం వెలుగు చూసింది. వెంటనే పోలీసులు సౌమ్య, ఇద్దరు శ్రీధర్ లను అరెస్టు చేసి వారి మీద కేసు నమోదు చేశారు. సౌమ్య, కృష్ణమూర్తిలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.