Waqf: ఆ ఊరంతా మాదే ఖాళీ చేయండి.. వక్ఫ్ బోర్డు నోటీసులతో తమిళనాడు గ్రామంలో ఆందోళనలు
Waqf Board Claims Entire Tamil Nadu’s village: వక్ఫ్ బోర్డు తమిళనాడులోని ఒక గ్రామాన్ని తమ ఆస్తిగా ప్రకటించి, అక్కడ నివసిస్తున్న సుమారు 150 కుటుంబాలకు ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Waqf Board Claims Entire Tamil Nadu’s village: దాదాపు 150కి పైగా కుటుంబాలు ఉంటున్న గ్రామం. ఇప్పుడు కాదు చాలా కాలం నుంచి ఇక్కడే జీవిస్తున్నారు. గ్రామం దగ్గరలోనే వారికి వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఒక్కసారిగా ఈ ఊరంతా మాదే.. ఇక్కడి భూములను ఖాళీ చేయండి అంటూ ప్రస్తుతం వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న వక్ఫ్ బోర్డు నోటీసులు ఇచ్చింది.
దీంతో ఎప్పటి నుంచో ఉంటున్న గ్రామంలో అలజడి మొదలైంది. తీవ్ర నిరసనలకు వేదికైంది. ఈ ఘటన తమిళనాడు వెల్లూరు జిల్లా అనైకట్టు తాలూకాలోని కోటుకొల్లై గ్రామంలో చోటుచేసుకుంది. ఇప్పుడు ఈ అంశం కేవలం తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా అగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
వక్ఫ్ బోర్డు ఈ గ్రామాన్ని తమ ఆస్తిగా ప్రకటించి, అక్కడ నివసిస్తున్న సుమారు 150 కుటుంబాలకు ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపింది. ఈ గ్రామంలోనే తాము నాలుగైదు తరాలుగా నివసిస్తున్నామనీ, తమ వద్ద ప్రభుత్వ పట్టు పత్రాలు ఉన్నాయని అక్కడుంటున్న వారు చెబుతున్నారు. వక్ఫ్ బోర్డు ఎలా తమ భూమి అని ఒక ఊరును ఖాళీ చేయమంటుందని ఆగ్రహం వ్యక్తమవుతోంది.
వక్ఫ్ బోర్డు నోటీసు ఏంటి?
వక్ఫ్ బోర్డు అధికారి సయ్యద్ అలీ సుల్తాన్ షా జారీ చేసిన నోటీసులో సర్వే నంబర్ 330/1లోని భూమి స్థానిక దర్గాకు చెందినదనీ, గ్రామస్తులు వెంటనే భూమిని ఖాళీ చేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
వక్ఫ్ బోర్డు నోటీసులపై గ్రామస్థులు ఏం చెబుతున్నారు?
ఈ నోటీసులు అందుకున్న గ్రామస్తులు, తమ భూమి తమకు చెందినదనీ, నాలుగైదు తరాలుగా నివసిస్తున్నామని చెబుతున్నారు. అలాగే, తమ వద్ద భూమి పట్టా పత్రాలు ఉన్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే వక్ఫ్ బోర్డు, ప్రభుత్వ తీరుపై 15 ఏప్రిల్ 2025న వెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు ఆందోళనకు దిగారు.
రాజకీయ నాయకులు - ప్రభుత్వ స్పందనలేంటి?
హిందూ మున్నాని నాయకుడు మహేష్, ఈ వివాదంపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరిపించాలన్నారు. అలాగే, గ్రామంలోని ప్రతి ఒక్కరికీ భూ పట్టాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు.
అయితే, తమిళనాడులోని కాంగ్రెస్ ఎమ్మెల్యే హసన్ మౌలానా "ఒకసారి వక్ఫ్ బోర్డ్ ది అయితే, ఎప్పటికీ వక్ఫ్" అని చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. 150 గ్రామాల్లోని భూమిపై వక్ఫ్ వాదనకు తమిళనాడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిందనీ, గ్రామస్తులు వక్ఫ్ బోర్డుకు అద్దె చెల్లించాలనే కామెంట్స్ తో గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు.
అయితే, గ్రామస్తులు తమ భూమిపై చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతం, జిల్లా అధికారులు ఈ వివాదంపై అధికారిక ప్రకటన చేయలేదు. గ్రామస్థులు తమ నివాసాలు, జీవనాధారాలను కాపాడుకునేందుకు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసనలు చేస్తున్నారు.
తమిళనాడుతో ఇలా భూములను క్లెయిమ్ చేయడం ఇదే మొదటిసారి కాదు. 1500 సంవత్సరాల పురాతనమైన మానెండియవల్లి సమేత చంద్రశేఖర్ స్వామి ఆలయం ఉన్న తిరుచెందురై గ్రామం మొత్తం తమదేనని తమిళనాడు వక్ఫ్ బోర్డు 2022లో క్లెయిమ్ చేసింది. వక్ఫ్ సవరణ చట్టం చుట్టూ కొనసాగుతున్న వివాదాల మధ్య ఇది జరగడం గమనార్హం.