పవన్ కల్యాణ్ చెప్పినట్లే చేయమంటోన్న విశ్వహిందూ పరిషత్ ... వక్ఫ్ జెపిసికి ఆసక్తికర లేఖ
సనాతన ధర్మ పరిరక్షణకు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కల్యాణ్ ఎంత గట్టిగా నిలబడి పోరాటం చేసారో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన డిమాండ్ కు విశ్వహిందూ పరిషత్ మద్దతు లభించింది. ఈ మేరకు వక్ఫ్ బోర్డ్ సవరణ కోసం ఏర్పాటైన జెపిసికి విహెచ్పి ఆసక్తికర లేఖ రాసింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
Pawan kalyan
Pawan Kalyan : పరమత సహనాన్ని పాటించాలని సనాతన ధర్మం చెబుతుంది... అంటే తన మతాన్ని విశ్వసిస్తూ ఇతర మతాలను గౌరవించాలనేది దీని సారాంశం. అయితే ఇటీవల కాలంలో సనాతన ధర్మాన్ని కించపర్చేలా, హిందువుల మనోభావాలను దెబ్బతీసే సంఘటనలు అనేక చోటుచేసుకున్నాయి. దీంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లాంటివారు బయటకు వచ్చి బహిరంగంగానే సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడం చేయాల్సి వచ్చింది.
దేశంలో కుల,మత, బాషా బేధాలు లేకుండా చూడాలని ప్రభుత్వాలను, పాలకులను పవన్ కల్యాణ్ కోరారు. దేశ ప్రజలందరికీ ఒకే రకమైన చట్టాలను అమలుచేయాలని... ఏ మతానికి ముప్పు, హాని కలిగిన ఒకేలా స్పందించి నిజమైన లౌకికవాదాన్ని ప్రదర్శించాలని కోరారు. అలాగే సనాతర ధర్మానికి హాని కలిగించే చర్యలను నిరోధించడానికి జాతీయ స్థాయిలో బలమైన చట్టాలను తేవాలని కోరారు. మొత్తంగా ముస్లింలకు వక్ఫ్ బోర్డ్ మాదిరిగానే హిందువులకు 'సనాతర ధర్మ పరిరక్షణ బోర్డ్' ఏర్పాటుచేయాలని పవన్ డిమాండ్ చేసారు.
ప్రస్తుతం ఇలాంటి డిమాండ్ నే విశ్వహిందూ పరిషత్ కూడా చేస్తోంది. ఒక్కో మతానికి ఒక్కో చట్టం కాదు... అన్ని మతాలను సమానంగా వుండేలా ఓ చట్టాన్ని తేవాలని విహెచ్పి కోరుతోంది. ముఖ్యంగా అన్ని మతాల ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం తీసుకురావాలని వక్ఫ్ చట్ట సవరణ కోసం ఏర్పాటయిన JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరింది విశ్వహిందూ పరిషత్.
Vishva Hindu Parishad
వక్ఫ్ బోర్డ్ జెపిసికి విహెచ్పి రాసిన లేఖలో ఏముంది?
వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు 2024 పరిశీలనకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. లోక్ సభ, రాజ్యసభల నుండి అధికార, ప్రతిపక్ష ఎంపీలతో ఈ కమిటీని ఏర్పాటుచేసారు. 1995 వక్ఫ్ చట్టంలో సవరణల కోసం కేంద్ర బిల్లును తీసుకువచ్చింది... ఇందులోని ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఈ జెపిసిని ఏర్పాటుచేసారు.
తాజాగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ కోసం ఏర్పాటైన జెపిసికి విశ్వహిందూ పరిషత్ లేఖ రాసింది. దేశంలోని అన్ని మతాల ధార్మిక ఆస్తుల కోసం ఒకే చట్టం తీసుకురావాలని విహెచ్పి ప్రతిపాదించింది. ముస్లింల కోసం మాత్రమే కాకుండా అన్ని మతాలకు ఈ చట్టం వర్తించాలని సూచించింది.
''ముస్లిం మతపరమైన ఆస్తుల కోసం వక్ఫ్ బోర్డ్ పనిచేస్తుంది. ఆ మతానికి చెందిన స్థిర, చరాస్తులను ఈ బోర్డ్ కాపాడుతుంది. ఒక్కసారి ఏదయినా ఆస్తి వక్ఫ్ పరిధిలోకి అది అల్లా ఆస్తిగా మారుతుంది... ఇది శాశ్వతంగా వక్ఫ్ పరిధిలోనే వుంటుంది'' అని ముస్లిం చట్టాలు చెబుతాయి. అయితే ఇలాంటి చట్టం గాని, బోర్డు గాని ఇతర మతాల్లో లేవు. కాబట్టి అన్ని మతాలకు సమానంగా చూసే చట్టాన్ని తీసుకురావాలని విహెచ్పి కోరుతోంది.
ముస్లింలే కాదు ఇతర మతాలవారు కూడా తమ విశ్వాసాలను అనుగుణంగా ఆస్తులను విరాళంగా ఇస్తారని విహెచ్పి పేర్కొంది. హిందువులు దేవాలయాల నిర్వహణ కోసం లేదంటే పవిత్రమైన, ధార్మిక, దాతృత్వ ప్రయోజనాల కోసం స్థిర లేదా చర ఆస్తులను అంకితం చేస్తారు.అలాగే క్రైస్తవ, బౌద్ద, జైన, సిక్కు మతాలకు చెందినవారు కూడా తమ మత విశ్వాసాలను అనుసరించి ఆస్తులను అంకితం చేస్తారు.
అయితే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం ''దేశమంతటా పౌరుల కోసం ఏకరీతీ పౌర కోడ్ను అమలు చేయడానికి ప్రయత్నించాలి'' వుంది. కాబట్టి కేవలం ముస్లింల కోసం ప్రత్యేక చట్టాలను అమలుచేయడం తగదని... అన్ని మతాలకోసం ఒకే చట్టాన్ని అమలుచేయాలని జాయింట్ పార్లమెంటరీ కమిటీని కోరింది విహెచ్పి.
Waqf Board
1954 లో వక్ఫ్ బిల్లు ఎలా వచ్చింది :
1954లో వక్ఫ్ చట్టం అమలులోకి వచ్చింది. అయితే ఇది ప్రభుత్వం తీసుకువచ్చింది కాదు... ప్రైవేట్ మెంబర్ బిల్లు. మహమ్మద్ అహ్మద్ కాజ్మీ దీన్ని ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ప్రభుత్వంతో ఎలాంటి సబంధంలేదని ఆనాటి న్యాయశాఖ మంత్రి బిస్వాస్ వెల్లడించారని విశ్వహిందూ పరిషత్ చెబుతోంది.
ఈ ప్రైవేట్ బిల్లును రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపించారు. అప్పటి న్యాయ మరియు మైనారిటీ వ్యవహారాల మంత్రి సి.సి. బిశ్వాస్ ఈ సెలెక్ట్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ''ఈ బిల్లు విషయంలో ప్రభుత్వం తెర వెనుక ఉందనే ప్రచారంలో వాస్తవం కాదు. ప్రభుత్వమే ఇదంతా చేయాలనుకుంటే బహిరంగంగా ముందుకు వచ్చి ఉండేది” అని అన్నారు.
ఏకరీతి పౌర నియమావళి ఉండాలని చెప్పే నిర్దేశక సూత్రాల ప్రకారం ముస్లింలను మాత్రమే కాకుండా హిందువులు, పార్సీలు, జైనులు, సిక్కులు... ఇలా అన్నిమతాల ఆస్తుల పరిరక్షణ కోసం ఓ చట్టాన్ని తేవాలని ఆనాడే న్యాయమంత్రి ప్రతిపాదించాట.ఒక మతానికి మాత్రమే సంబంధించి చట్టం ఉండటం తగదని ఆయన పేర్కొన్నట్లు విహెచ్పి చెబుతోంది.
కాబట్టి విభిన్న మతాల ధార్మిక ఆస్తుల నిర్వహణకు వేర్వేరు చట్టాల అవసరం లేదని, అన్ని మతాలకు వర్తించే ఒకే చట్టం రూపొందించాలనే ఈ సువర్ణావకాశాన్ని ఉపయోగించుకోవాలని జెపిసికి విహెచ్పి సూచించింది. అవసరమైతే ప్రత్యేక మతాల ఆచారాలకు అనుగుణంగా కొన్ని మినహాయింపులు ఉండవచ్చని విహెచ్పి పేర్కొంది. ఈ మేరకు విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రతినిధి వినోద్ బన్సాల్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది.