ఇలాంటి కొడుకు ఉంటే ఏంటి? పోతే ఏంటి? కుంభమేళకు వెళ్తూ తల్లిని ఇంట్లో తాళం వేసిన వైనం
తల్లిదండ్రిమీద దయలేని పుత్రుండు పుట్టనేమి.? వాడు గిట్టనేమి? పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా. ఇది కొన్ని వందల ఏళ్ల క్రితం వేమన రాసిన పద్యం. కనిపెంచిన పేరెంట్స్ను గాలికి వదిలేస్తున్న వారు రోజురోజుకీ పెరిగిపోతున్న ఈ సమాజంలో తాజాగా జరిగిన ఓ సంఘటన యావత్ సమాజం తల దించుకునేలా చేసింది..

సమాజంలో రోజురోజుకీ విలువలు తగ్గిపోతున్నాయి. తమ సంతోషం కోసం ఎంతకైనా దిగజారుతున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులను గాలికి వదిలేస్తున్నారు. ఈ కారణంగానే దేశంలో వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి. నవమాసాలు పెంచిన తల్లినే భారంగా భావిస్తున్నారు కొందరు మహానుభావులు. తాజాగా ఝార్ఖండ్లోని రామ్గడ్ జిల్లా కేంద్రంలో ఓ జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్కి గురి చేసింది.
ఝార్ఖండ్లోని రామ్గడ్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యాపిల్లలు, అత్తమామలతో కలిసి మహా కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ వెళ్లాడు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్లాడు. అయితే 65 ఏళ్ల సంజూదేవీని ఇంట్లో బంధించి బయట నుంచి తాళం వేసుకొని వెళ్లడం అత్యంత హేయమైన చర్య. సోమవారం నుంచి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సంజూదేవీ తినడానికి తిండి కూడా లేకపోవడంతో అటుకులు తింటూ కాలం వెల్లదీసింది.
అయితే విపరీతమైన ఆకలి వేయడంతో విలపిస్తూ పొరుగింటి వారిని పిలిచింది. దీంతో ఇంటికి తాళం వేసి ఉన్నట్లు గమనించిన పొరిగింటి వారు సంజూదేవీ కుమార్తె చాందినీదేవికి సమాచారం అందించారు. దీంతో ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తాళాలు బద్దలు కొట్టి వృద్ధురాలిని బయటకు తీసుకొచ్చారు. వెంటనే పొరుగింటి వారు ఆమెకు ఆహారాన్ని అందించారు.
ఆ తర్వాత కావాల్సిన ట్యాబ్లెట్స్ను అందించి ఆసుపత్రిలో చేర్చినట్లు వృద్ధురాలి కూతురు తెలిపింది. కన్న తల్లిని ఇంట్లో బంధించి వెళ్లిన కుమారుడిపై స్థానికులు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ఇంతకంటే నీచమైన చర్య మరోటి ఉంటుందా అని ప్రశ్నించారు. అయితే తన తల్లి అనారోగ్యంతో ఉందని, ఆమెకు ఆహారానికి సంబంధించి అన్నిరకాల ఏర్పాట్లు చేసిన తర్వాతే తాము ప్రయాగ్రాజ్ వెళ్లినట్లు కుమారుడు తెలిపాడు.