స్నేహితురాలి పెళ్లి కోసమే నేపాల్ కు రాహుల్.. ఇంతకీ ఎవరీ సుమ్నిమా ఉదాస్?
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని చిక్కుల్లో పడేసిన నేపాలీ స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్. ఆమె పెళ్లికే రాహుల్ నేపాల్ వెళ్లారు. ఆమె గురించిన ఆసక్తికర విషయాలు కొన్ని...
నేపాల్ పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడ ఓ నైట్ క్లబ్ కు వెళ్లినట్లు బయటకు వచ్చిన దృశ్యాలు రాజకీయ దుమారానికి తెర లేపిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ట్వీట్ల యుద్ధం కొనసాగుతుంది. కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిగా చెప్పుకునే నాయకులు నైట్ క్లబ్లు తిరగడం ఏంటంటే బీజేపీ విమర్శనాస్త్రాలు సంధిస్తుండగా.. వ్యక్తిగత పర్యటనల పై విమర్శలు కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు… తన వ్యక్తిగత పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ ఐదు రోజుల పర్యటనకు సోమవారం కాట్మండు వెళ్లారు.
తన నేపాలీ స్నేహితురాలు సుమ్నిమా ఉదాస్ వివాహానికి రాహుల్ వెళ్లినట్లు అక్కడి మీడియా పేర్కొంది భారత్కు చెందిన మరికొందరు వీఐపీలు కూడా హాజరవుతున్నట్లు తెలిపింది అసలు ఎవరి సుమ్నిమా ఉదాస్? ఆమె గురించి కొన్ని వివరాలు…
సుమ్నిమా ఉదాస్ ఓ పాత్రికేయురాలు. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ సీఎన్ఎన్-ఐబీఎన్ ఇంటర్నేషనల్ కు ఢిల్లీ ప్రతినిధిగా ఆమె పనిచేశారు. దేశంలో కీలక రాజకీయ పరిణామాలతో పాటు ఆర్థిక, సామాజిక, పర్యావరణ తదితర రంగాల పై అనేక ఆసక్తికర కథనాలు ఇచ్చారు. దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసుతో పాటు మలేషియా విమానం కుప్పకూలడం, కామన్వెల్త్ అవినీతి కుంభకోణం తదితర అంశాలపైనా ప్రముఖంగా కథనాలు రాశారు.
ఆమె లింక్డిన్ అకౌంట్లో ఉన్న వివరాల ప్రకారం.. 2001 నుంచి 2017 వరకు సీఎన్ఎన్ లో పనిచేసిన సుమ్నిమా ఉదాస్.. 2018 నుంచి లుంబిని మ్యూజియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, ఫౌండర్ గా కొనసాగుతున్నారు. జెండర్ సంబంధిత సమస్యల పై రిపోర్టింగ్ చేసినందుకుగాను 2014 మార్చిలో జరిగిన మహిళా సాధికారత (WE) జర్నలిజం అవార్డ్స్ లో భాగంగా సుమ్నిమా ఉదాస్ కు ‘జర్నలిస్ట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది.
అలాగే భారత్ లోని గ్రామాల్లో బానిసత్వం గురించి రిపోర్టు చేసినందుకు 2012లో ప్రతిష్టాత్మక సినీ గోల్డ్ అవార్డు గెలుచుకున్న టీం లో సుమ్నిమా ఉదాస్ కూడా ఒకరు. సుమ్నిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ అధికారిగా పనిచేశారు. మయన్మార్ లో నేపాల్ రాయబారిగా సేవలందించారు. దీంతో ఆమె చిన్నప్పటి నుంచి దాదాపు పది దేశాల్లో ఉన్నారు.
వర్జీనియాలోని వాషింగ్టన్ అండ్ లీ యూనివర్సిటీలో బ్రాడ్కాస్ట్ జర్నలిజంలో బ్యాచిలర్ డిగ్రీ చేసిన సుమ్నిమా ఉదాస్.. ఆక్స్ఫర్డ్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు.
మంగళవారం సుమ్నిమా ఉదాస్ వివాహం జరగనుండడంతో రాహుల్ గాంధీ సోమవారం కాట్మండు వెళ్లారు. మే 5న హయత్ రీజెన్సీ హోటల్ లో రిసెప్షన్ జరగనుంది. అయితే, తమ కుమార్తె పెళ్ళికి రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు సుమ్నిమా ఉదాస్ తండ్రి భీమ్ ఉదాస్ తెలిపారు.