డీ-4లో అరుణ్ జైట్లీ మృతితో మిగిలింది ఒక్కరే..
డి-4 లేదా ఢిల్లీ4 గా పిలువబడే నలుగురిలో అరుణ్ జైట్లీ మరణంతో ఇప్పుడు కేవలం ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే జీవించి ఉన్నారు.సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఈ నలుగురిని డి 4 గా వ్యవహరిస్తుంటారు.
డి-4 లేదా ఢిల్లీ4 గా పిలువబడే నలుగురిలో అరుణ్ జైట్లీ మరణంతో ఇప్పుడు కేవలం ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే జీవించి ఉన్నారు.సుష్మా స్వరాజ్, అనంత్ కుమార్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఈ నలుగురిని డి 4 గా వ్యవహరిస్తుంటారు. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండే వారుగా ఈ నలుగురు నాయకులకు పార్టీలో మంచి పేరుంది.
2009లో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఈ నలుగురే చూసుకున్నారు. వారికి ముఖ్యంగా పాత తరం బీజేపీ నాయకులు అద్వానీ, వాజపేయిల ఆశీస్సులు పుష్కలం. 2009లో బీజేపీ ఓటమి చెందిన తరువాత ఆర్ ఎస్ ఎస్ అద్వానీ కాకుండా వేరే నాయకులకోసం వెదకడం ఆరంభించింది. నితిన్ గడ్కరీని బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆర్ ఎస్ ఎస్ అప్పుడు చేసింది కూడా ఈ నలుగురి ప్రాబల్యాన్ని తగ్గియ్యడం కోసమే. కానీ వీరి నాయకత్వ లక్షణాలు, వీరి వాక్చాతుర్యము వారిని మరింతగా తిరుగులేని నేతలను చేసింది. 2009లో సుష్మా స్వరాజ్ లోక్ సభలో ప్రతిపక్షనేతగా ఉంటే అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్షనేతగా బీజేపీ వాణిని బలంగా వినిపించారు.
2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక వీరందరూ మంత్రిపదవులు చేపట్టారు కూడా. అనంత్ కుమార్ రసాయన, ఎరువుల శాఖా మంత్రిగా వ్యవహరించగా అరుణ్ జైట్లీ ఆర్ధిక మంత్రిగా సేవలందించారు. సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా వెంకయ్య నాయుడు పార్లమెంటరీ వ్యవహారాల శాఖకు ప్రాతినిధ్యం వహించారు. వారు తమ పనితీరుతో ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు.
పదవిలో ఉండగానే అనంత్ కుమార్ 2018నవంబర్ లో మరణించారు. సుష్మా స్వరాజ్ అనారోగ్య కారణాల వల్ల 2019 ఎన్నికల్లో పోటీ చేయలేదు. అరుణ్ జైట్లీ కూడా అనారోగ్య కారణంగానే మంత్రి పదవిని చేపట్టనని తెలిపారు. అప్పటికే వెంకయ్య నాయుడు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉప రాష్ట్రపతి అయ్యారు. ఇలా 2019 ఎన్నికల నాటికే ఈ డి4ల ప్రాభవం కొద్దిగా తగ్గింది.
2019లో రెండో దఫా బీజేపీ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా గడవక ముందే సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీలు కాలం చేశారు. దీనితో ఈ నలుగురిలో ఇప్పుడు కేవలం వెంకయ్య నాయుడు ఒక్కరు మాత్రమే మిగిలారు. ఈ నలుగురిలో ముగ్గురు భౌతికంగా దూరమైనప్పటికీ వారు వారి పరిపాలనతో ప్రజల మనుషుల్లో వేసిన ముద్ర మాత్రం ఎన్నటికీ చెరిగిపోదు.