వేడినీళ్లతో స్నానం.. కరోనాకు చెక్ పెట్టొచ్చా?
వేడి నీళ్లు తాగడం, వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందని ప్రచారం వెలుగులోకి వచ్చింది.
కరోనా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి... ఇది చేయద్దు... దీనివల్ల కరోనా రాదు.. ఇలాంటి అనేక సమాచారం సోషల్ మీడియాలో కోకొల్లలుగా దొరుకుతోంది.
అయితే ఇందులో ఏది నిజమో, ఏది అబద్దమో సామాన్యులు తెలుసుకోలేని పరిస్థితి. కొందరు వాటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
ఇందులో భాగంగానే వేడి నీళ్లు తాగడం, వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల కరోనా నయమవుతోందని ప్రచారం వెలుగులోకి వచ్చింది.
అయితే ఈ విషయంపై భారత ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వేడినీళ్లు కరోనాను చంపడం లేదా తగ్గించడం అనేది నిజం కాదని వెల్లడించింది.
ప్రయోగశాలలో ప్రత్యేక పద్ధతుల్లో 60 నుంచి 70 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మాత్రమే కరోనా వైరస్ మరణిస్తుందని తెలిపింది.
వేడి నీళ్లు తాగడం, వాటితో స్నానం చేయడం వల్ల కరోనా అంతం మాట అటుంచితే.. శరీరానికి ఎంతో కొంత ఉపశమనం లభిస్తుందనేది మాత్రం వాస్తవం.
వేడి నీళ్ళ స్నానం వల్ల ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. కండరాలకు రక్తసరఫరా సరిగా అందుతుంది. అలాగే మంచి నిద్ర పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
గొంతు నొప్పి తగ్గడానికి వేడి నీళ్ళ లో ఒక చిటికెడు ఉప్పు, పసుపు వేసుకుని ఆ నీటితో పుక్కిలించడం వల్ల ఉపశమనం కలుగుతుందని ఆయుష్ శాఖ సూచించింది.
వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. కేంద్ర నాడీ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
అయితే వేడి నీళ్లు తాగడం వల్ల కరోనా రాదన్నది నిజం కాదని చెబుతూనే.. మాస్కు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించడం, అత్యవసరం అయితే బయటికి వెళ్లడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రభుత్వం సూచించింది. వాటి వల్లే కరోనా రాకుండా చూసుకోవచ్చని స్పష్టం చేసింది.