భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్
భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్గా అజిత్ అగార్కర్ను బీసీసీఐ నియమించింది. టీమిండియా తరఫున 191 వన్డేలు, 26 టెస్టులు ఆడిన అజిత్ అగార్కర్ చేతన్ శర్మ స్థానంలో సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీ చీఫ్గా నియమితులయ్యారు.

ఢిల్లీ : టీమిండియా సీనియర్ పురుషుల క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా మాజీ ఫేసర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. అజిత్ అగార్కర్ ను ఈ పదవికి బీసీసీఐ క్రికెట్ సలహా కమిటీ ఎంపిక చేసినట్లుగా బీసీసీఐ కార్యదర్శి జై షా మంగళవారం నాడు ప్రకటించారు. అతడిని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) నియమించింది.
దీని గురించి వివరాలు చెబుతూ.. ‘సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపెలతో కూడిన క్రికెట్ సలహా కమిటీలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. సెలక్షన్ కమిటీలో ఖాళీ అయిన ఆ స్థానానికి ఇంటర్వ్యూలు నిర్వహించింది. ఈ ఇంటర్వ్యూలో కమిటీ అజిత్ అగార్కర్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. ఆ తర్వాత చూస్తే మిగతా సెలెక్టర్ల కంటే ఎక్కువ అంతర్జాతీయ అనుభవం అజిత్ అగార్కర్ కే ఉంది. దీంతో అతడినే సెలక్షన్ కమిటీ చైర్మన్గా ప్రతిపాదించింది’ అని బీసీసీఐ కార్యదర్శి జై షా ఒక ప్రకటనలో తెలిపారు.
అంతకుముందు టీమిండియా చీఫ్ సెలెక్టర్ గా ఉన్న చేతన్ శర్మ కొద్ది నెలల క్రితం భారత జట్టులోని కొంతమంది ఆటగాళ్ల గురించి అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకి వచ్చింది. దీంతో చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశాడు. అప్పటి నుంచి ఆస్థానం ఖాళీగా ఉంది. ఇప్పుడు దానిని అజిత్ అగార్కర్ భర్తీ చేస్తారు.
ఇక ఈ కమిటీలో సుబ్రతో బెనర్జీ, సలీంకోలా, శరత్, ఎస్ ఎస్ దాస్ మిగతా సభ్యులుగా ఉన్నారు. అజిత్ అగార్కర్ కి 45 సంవత్సరాలు. 1998-2007మధ్య కాలంలో అజిత్ అగార్కర్ 191 వన్డేలు ఆడారు. వీటితో పాటు 26 టెస్ట్ మ్యాచ్లు, నాలుగు టి20 మ్యాచ్ లు ఆడారు. ఈ మూడు ఫార్మాట్ లను వందల వికెట్లు తీసుకున్నారు. వరుసగా 288, 58, 3 వికెట్లు పడగొట్టారు. మూడు వన్డే ప్రపంచ కప్ లో భారత జట్టు సభ్యుడుగా అజిత్ అగార్కర్ ఉన్నారు.
1999, 2003, 2007 వన్డే వరల్డ్ కప్ లో ఇండియన్ టీం మెంబర్, 2007 టీ 20 ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టులో కూడా అజిత్ అగార్కర్ ఉన్నారు. అజిత్ అగార్కర్ ప్రధానంగా బౌలర్. అయినప్పటికీ లార్డ్స్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టిన అరుదైన రికార్డ్ అజిత్ అగార్కర్ సొంతం. దీంతోపాటు భారత్ తరపున ఆడి వన్డేలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించిన రికార్డు కూడాఅజిత్ అగార్కర్ సొంతం.
అగార్కర్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత చాలా ఏళ్ల నుంచి విశ్లేషకుడగా, వ్యాఖ్యాతగా ఉంటున్నారు. రిటైర్మెంట్ కు ముందు 2000లో జింబాబ్వే జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లో 52 చేశారు. 2004లో ఆస్ట్రేలియా భారత్ చారిత్రక విజయం సాధించింది. ఈ విజయంలో ఆరు వికెట్లు తీసి అజిత్ అగార్కర్ కీలక పాత్ర పోషించాడు.