పవార్ మంతనాలు: కేసీఆర్ గ్రీన్ సిగ్నల్, ఏమీ చెప్పని జగన్
బిజెపి నాయకత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ)కి తగిన మెజారిటీ రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ కోసం నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ ప్రయత్నాలు ప్రారంభించారు.
న్యూఢిల్లీ: బిజెపి నాయకత్వంలోని జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఎ)కి తగిన మెజారిటీ రాకపోతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ కోసం నేషనలిస్టు కాంగ్రెసు పార్టీ (ఎన్సీపీ) నేత శరద్ పవార్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్డీఎకు పూర్తి మెజారిటీ వస్తుందని ఎగ్జెట్ పోల్ సర్వేలు అంచనా వేసినప్పటికీ వాటిని ప్రతిపక్షాలు విశ్వసించడం లేదు.
బిజెపియేతర పార్టీలను తమ వైపు తిప్పుకోవడానికి తగిన ప్రయత్నాలను శరద్ పవార్ ప్రారంభించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ లతో ఆయన మాట్లాడినట్లు తెలుస్తోంది.
ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం లభిస్తే మద్దతు పలకాలని శరద్ పవార్ వారిని కోరినట్లు తెలుస్తోంది. యుపిఎకు మద్దతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తాకథనాలు వచ్చాయి. అయితే, జగన్ మాత్రం ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదని అంటున్నారు.
చంద్రబాబు ప్రతిపక్షాలను కూడగట్టడానికి ప్రయత్నాలు సాగిస్తున్న విషయం తెలిసిందే. ఆయన మమతా బెనర్జీ, మాయావతి, అఖిలేష్ యాదవ్ లతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. మంగళవారంనాడు ఆయన మాజీ ప్రధాని దేవెగౌడను కలిశారు.