మరో సంచలనానికి తెరలేపిన జెఫ్ బెజోస్... 100 మిలియన్ డాలర్లతో అవార్డు...!
తొలి అవార్డును ప్రముఖ చెఫ్ జోస్ ఆండ్రెస్, సామాజిక కార్యకర్త వ్యాన్ జోన్స్ అనే ప్రముఖులకు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ అవార్డు కింద ఇరువురికి చెరో వంద మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 74602 కోట్లు ఇవ్వనున్నారు.
దిగ్విజయంగా రోదసీ యాత్ర పూర్తి చేసి తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్న ప్రపంచ కుబేరుడు, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్.. మరో కీలక ప్రకటన చేశారు. తమ సొంత కంపెనీ ‘బ్లూ ఆరిజిన్’ రూపొందించిన ‘న్యూ షెఫర్డ్’ వ్యోమ నౌకలో తొలిసారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన సందర్భంగా ‘కరేజ్ అండ్ సివిలిటీ’ అనే అవార్డును ప్రకటించారు.
సమాజంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకు వస్తున్న వారికి ఈ అవార్డు ప్రదానం చేయనున్నట్లు బెజోస్ తెలిపారు. భవిష్యత్తులో మరింత మందికి ఈ అవార్డులు ఇస్తామని పేర్కొన్నారు.
జోస్ ఆండ్రెస్ ఫ్రాన్స్ కు చెందిన ప్రముఖ చెఫ్. 2010లో ఈయన ‘వరల్డ్ సెంట్రల్ కిచెన్ డబ్ల్యూసికె’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రాంతాలతో పాటు ఆకలితో అలమటిస్తున్న ప్రాంతాల్లో భోజనం అందజేస్తున్నారు. కరోనా సంక్షోభంలో అనేకమందికి అండగా నిలిచారు.
భారత్ లో ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్ తో కలిసి 15 ప్రముఖ నగరాల్లో 30 ప్రాంతాల నుంచి ప్రజలకు భోజనం అందజేస్తున్నారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో ఆస్పత్రిలో బాధితులు వారి కుటుంబ సభ్యులతో పాటు వైద్య ఆరోగ్య సిబ్బందికి అండగా నిలుస్తున్నారు. 2 వారాల క్రితం భారత్కు వచ్చిన ఆండ్రెస్ ఇప్పటివరకు మనదేశంలో నాలుగు లక్షల మీల్స్ అందజేసినట్లు వెల్లడించారు.