- Home
- Feature
- మనిషికి ఎక్కించిన తొలి రక్తం మరో మనిషిది కాదు గొర్రెది.. రక్తమార్పిడి చికిత్స ఇలాగే మొదలైంది
మనిషికి ఎక్కించిన తొలి రక్తం మరో మనిషిది కాదు గొర్రెది.. రక్తమార్పిడి చికిత్స ఇలాగే మొదలైంది
First Blood Transfusion: ఇప్పుడు రక్తం అవసరమైతే కొన్ని నిమిషాల్లోనే రక్త మార్పిడి చేస్తున్నారు. కానీ 150 ఏళ్ల క్రితం పరిస్థితి ఇలా లేదు. రక్త గ్రూపులు తెలియని రోజుల్లో ఎన్నో ప్రయోగాలు చేశారు. అసలు రక్త మార్పిడి ఎలా మొదలైంది? రక్తం ఎలా ఎక్కించారు?

శతాబ్దాల క్రితం రక్తం ఎలా ఎక్కించేవారో తెలుసా?
ఒకప్పుడు రక్త మార్పిడి అనేది అసాధ్యమైన వైద్య ప్రక్రియగా భావించేవారు. ఇప్పుడు ఆసుపత్రుల్లో సురక్షితంగా జరిగే ఈ చికిత్స వెనుక ఎన్నో సంవత్సరాల పరిశోధనలు, విజయాలు, వైఫల్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి రక్తం ఎక్కించడం చాలా నార్మల్ విషయం. శతాబ్దాల క్రితం వైద్యులు రక్తం ఎలా పనిచేస్తుందో కూడా పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. అందుకే ఎన్నో ప్రయోగాలు చేశారు. వాటిలో కొన్ని ప్రయోగాలు ప్రాణాలు మీదకి తీసుకొచ్చాయి.
మనిషికి గొర్రె రక్తం
17వ శతాబ్దంలో రక్త మార్పిడిపై పరిశోధనలు పెరిగాయి. ఆ కాలంలో మనిషికి జంతువుల రక్తాన్ని ఎక్కిస్తే ప్రాణాలు కాపాడవచ్చని కొందరు వైద్యులు భావించారు. అందుకే 1667లో ఫ్రాన్స్కు చెందిన వైద్యుడు జీన్-బాప్టిస్ట్ డెనిస్ ఒక ప్రయోగం చేపట్టారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ బాలుడికి గొర్రె నుంచి తీసిన రక్తాన్ని ఎక్కించారు. అయితే వెంటనే ఆ బాలుడు కోలుకోవడంతో ఈ ప్రయోగం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది.
అలాంటి విధానాలపై ఆంక్షలు
ఆ తర్వాత కూడా ఇలాంటి ప్రయోగాలు కొనసాగినా ప్రతిసారి ఫలితాలు ఒకేలా రాలేదు. కొందరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తగా, మరికొన్ని సందర్భాల్లో మరణాలు కూడా నమోదయ్యాయి. దీంతో జంతువుల నుంచి మనుషులకు రక్తం ఎక్కించే విధానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చివరకు అనేక దేశాలు ఈ ప్రయోగాలను నిలిపివేసి, అలాంటి విధానాలపై ఆంక్షలు విధించాయి.
ఆ రోజుల్లో రక్త గ్రూపుల గురించి ఎలాంటి సమాచారం లేకపోవడమే ఈ సమస్యలకు ప్రధాన కారణం. ఏ రక్తం ఎవరికి సరిపోతుందో తెలియకపోవడంతో రక్త మార్పిడి అత్యంత ప్రమాదకరంగా మారేది. అయితే కాలక్రమేణా వైద్యరంగంలో జరిగిన పరిశోధనలు ఈ రంగంలో విప్లవాత్మక మార్పులకు దారితీశాయి.
1900లో రక్త గ్రూపులు కనుగొన్న కార్ల్ లాండ్స్టైనర్
1818లో బ్రిటన్కు చెందిన వైద్యుడు జేమ్స్ బ్లండెల్ విజయవంతంగా ఒక మనిషి నుంచి మరో మనిషికి రక్తం ఎక్కించి వైద్య చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. అనంతరం 1900లో శాస్త్రవేత్త కార్ల్ లాండ్స్టైనర్ రక్త గ్రూపులను కనుగొనడంతో రక్త మార్పిడి విధానం సురక్షితంగా మారింది. ఏ రక్త గ్రూపు ఎవరికి సరిపోతుందో గుర్తించే అవకాశం రావడంతో వైద్య రంగంలో కొత్త యుగం ప్రారంభమైంది.
ప్రస్తుతం రక్త మార్పిడికి ముందు రక్త గ్రూపు నిర్ధారణ, క్రాస్మ్యాచింగ్, అంటువ్యాధుల పరీక్షలు వంటి అనేక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తున్నారు. ప్రమాదాలు, శస్త్రచికిత్సలు, ప్రసవాలు, క్యాన్సర్ చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు వంటి అనేక సందర్భాల్లో రక్త మార్పిడి లక్షలాది మంది ప్రాణాలను కాపాడుతోంది.
అప్పటి నుంచి ఇప్పటికీ ఎంతో అభివృద్ధి చెందిన వైద్య రంగం
ఒకప్పుడు గొర్రె రక్తంతో ప్రయోగాలు చేసిన స్థాయి నుంచి, నేడు అత్యాధునిక సాంకేతికతతో అత్యంత సురక్షితమైన రక్త మార్పిడి వ్యవస్థను అందించే స్థాయికి వైద్య శాస్త్రం ఎదిగింది. శతాబ్దాల పాటు జరిగిన పరిశోధనలు, విజయాలు, వైఫల్యాల ఫలితంగానే నేడు రక్త మార్పిడి ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలను కాపాడే అత్యంత కీలకమైన వైద్య సేవగా నిలిచింది.
