నన్ను కూడా సుశాంత్ లాగే: కరణ్ జోహర్ పై యంగ్ హీరో సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ సినీ పరిశ్రమలో నెపోటిజం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇండస్ట్రీ కొంత మంది ప్రముఖులు అసలైన టాలెంట్ ఎదగకుండా అడ్డుపడుతున్నారని, కేవలం సినీ వారసులను మాత్రమే ప్రొత్సహిస్తున్నారని ఆరోపణలు తీవ్ర మవుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత ఈ విషయాల మీద సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.
కరణ్ జోహార్, సల్మాన్ ఖాన్ లాంటి వారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా యంగ్ హీరో ఆయుష్మాన్ ఖురానా కూడా స్పందించాడు. తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనను కరణ్ జోహార్ ధర్మా ప్రొడక్షన్స్ సంస్థ ఎలా ఇబ్బది పెట్టిందో వివరించాడు ఆయుష్మాన్.
కరణ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్లను, వారసులుగా ఎంట్రీ ఇచ్చే వారిని మాత్రమే ఎంకరేజ్ చేస్తాడని వివరించాడు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో ఆయుష్మాన్ మాట్లాడుతూ కరణ్ తీరును వివరించాడు. కరణ్ జోహార్, ధర్మా ప్రొడక్షన్స్ కారణంగా తాను కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
నా కెరీర్ ప్రారంభంలో ధర్మా ప్రొడక్షన్స్ను సంప్రదించగా వారు స్టార్లతో వాళ్ల వారసులతో మాత్రమే సినిమాలు చేస్తామని నీలాంటి వారికి అవకాశం ఇవ్వడం కుదరదని ముఖం మీదే చెప్పారని ఆవేదన వ్యక్తం చేశాడు ఆయుష్మాన్. అయితే అది తన కెరీర్ స్టార్టింగ్ కాబట్టి పెద్దగా పట్టించుకోలేదని చెప్పాడు ఈ యంగ్ హీరో.
`ఆ తరువాత ఓ ప్రైవేట్ ఫంక్షన్లో కలిసిన కరణ్ తనను కలవమని స్వయంగా తన ఆఫీస్ ఫోన్ నంబర్ ఇచ్చాడు. కానీ ఆఫీస్కు కాల్ చేస్తే ఒకసారి ఆయన లేరని, మరోసారి బిజీగా ఉన్నారని చెప్పారు. కొన్ని రోజుల తరువాత ధర్మా ప్రొడక్షన్స్ స్టార్లతో మాత్రమే సినిమాలు చేస్తుందని, నీలాంటి వారితో చేయమని దురుసుగా అవమానకరంగా సమాధానం చెప్పా`రని ఆయుష్మాన్ తెలిపాడు.
అదే సమయంలో ఆయుష్మాన్కు షూజిత్ సర్కార్ దర్శకత్వంలో విక్కీ డోనర్ సినిమా అవకాశం రావటంతో ఆయనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు విమర్శకుల ప్రశంసలు కూడా రావటంతో విభిన్న కథలతో సినిమాలు తెరకెక్కించేందుకు ఆయుష్మాన్ బెస్ట్ ఛాయిస్ అయ్యాడు.