లైఫ్ ఇచ్చినవాడే దూరం పెట్టాడు.. వహీదా రెహమాన్ విషాద ప్రేమ కథ!
వహీదా రెహమాన్ ప్రేమలో విఫలమయ్యింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ప్రియుడు తనని అర్థంతరంగా వదిలేశాడు. తనకు ఓ గొప్ప లైఫ్ ఇచ్చి వ్యక్తిగత జీవితంలో మాత్రం మధ్యలోనే వదిలేశాడు.
సీనియర్ నటి వాహీదా రెహమాన్..కి ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన విషయం తెలిసిందే. కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇండియన్ సినిమాకి ఆమె చేసిన సేవలకుగానూ ఈ అత్యున్నత పురస్కారం అందిస్తున్నట్టు వెల్లడించారు. ఈసందర్భంగా వహీదా రెహమాన్ ప్రేమ కథ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
వహీదా రెహమాన్ ప్రేమలో విఫలమయ్యింది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి ప్రియుడు తనని అర్థంతరంగా వదిలేశాడు. తనకు ఓ గొప్ప లైఫ్ ఇచ్చి వ్యక్తిగత జీవితంలో మాత్రం మధ్యలోనే వదిలేశాడు. అతనెవరో కాదు గురుదత్. ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు. బాలీవుడ్లో దర్శకుడిగా రాణిస్తున్న ఆయన వహీదా రెహమాన్ని చూసి ఫిదా అయ్యాడు. ఆమె అందానికి మంత్రముగ్దుడై, ఏకంగా నటుడిగా మారాడు.
తెలుగు ముస్లీంకి చెందిన వహీదా రెహమాన్.. నటిగా ఎంట్రీ ఇచ్చింది కూడా తెలుగు సినిమాతోనే కావడం విశేషం. ఆమె `రోజులు మారాయి` సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ తర్వాత తమిళంలో చేసింది. ఈ క్రమంలో ఆమె దర్శకుడు గురుదత్ దృష్టిలో పడింది. ఆమె అందానికి ఫిదా అయిన ఆయన తన `సీఐడీ` చిత్రంలో హీరోయిన్గా తీసుకున్నారు. అలా బాలీవుడ్కి పరిచయం చేశాడు. ఆ సినిమా 1956నాటికి ఇండియన్ సినిమాలోనే అత్యధిక కలెక్షన్లు చేసిన చిత్రంగా నిలిచింది.
ఆ తర్వాత వహీదా కోసం మరోసారి హీరోగా మారారు. ఆయన అప్పటికే సినిమాలు చేస్తున్నారు. కానీ `ప్యాసా` చిత్రంలో దిలీప్ కుమార్ ని హీరోగా అనుకున్నారు. కానీ వహీదా రెహమాన్ హీరోయిన్గా చేస్తుండటంతో ఆయన్ని తప్పించే తనే హీరోగా చేశాడు. ఆ సినిమా సమయంలో ఈ ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగింది. ప్రేమ మరింతగా బలపడింది. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్.
అప్పటికే గురుదత్ కి పెళ్లి అయ్యింది. 1953లో గాయని గీతాదత్ను వివాహం చేసుకున్నారు. అయితే ‘ప్యాసా’ సినిమా సెట్స్పైనే వీరిద్దరి ప్రేమ ప్రపంచం ముందుకు రావడం మొదలైంది. ఒకానొక సమయంలో గురుదత్, వహీదా రెహమాన్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలొచ్చాయి. దీంతో గీత దత్ తీవ్రంగా విరుచుకుపడింది.
అనంతరం తన భర్త గురుదత్కు దూరమై తన బిడ్డతో విడిగా జీవించడం ప్రారంభించింది. గురుదత్ తన కుటుంబం దూరం అవ్వడంతో ఆ బాధను తట్టుకోలేకపోయాడు. అతని ముందు రెండు మార్గాలు ఉన్నాయి. మొదట, తన ప్రేమను అంటే వహీదా రెహ్మాన్ విడిచి పెట్టి భార్యా కొడుకుని ఎంచుకోవడం.. రెండవది.. మొదటి భార్యని వదిలి.. రెండవ భార్యగా వహీదాను పెళ్లి చేసుకోవడం.
గురుదత్ భార్యను ఎంచుకున్నాడు. గీత ఇంటికి తిరిగి వచ్చింది. అనంతరం గురుదత్ వహీదా రెహ్మాన్ నుండి దూరం కావడం ప్రారంభించాడు. గురుదత్ తన భార్య కోసం వహీదాని విడిచిపెట్టాడు. అయితే ప్రేమని మరచిపోలేక పోయాడు. దీంతో గురుదత్ చాలా రోజులు నిద్రపోలేదని సన్నిహితులు చెప్పేవారు. కాలక్రమంలో సిగరెట్ తాగడం, మద్యం తాగడం, నిద్రమాత్రలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆపై కేవలం 39 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. దీంతో అటు తన ప్రేమ, ఇటు తన జీవితం విషాదాంతంగా ముగిసింది.
అదే సమయంలో వహీదా కూడా ఎంతో కుంగిపోయింది. నటిగా బిజీ అయ్యింది. దేవ్ ఆనంద్తో ఎక్కువ సినిమాలు చేసింది. దీంతో ఈ ఇద్దరి మధ్య కూడా ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. గురుదత్తోపాటు దేవ్తో ఎక్కువ సినిమా చేసింది వహీదా రెహమాన్. కానీ కొన్నాళ్ల తర్వాత ఆమె 1974లో బాలీవుడ్ నటుడు శషి రేఖిని వివాహం చేసుకుంది. వీరిద్దరు కలిసి `షంగూన్` చిత్రంలోనూ నటించారు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు, సోహైల్ రేఖి, కాశ్వీ రేఖి ఉన్నారు. ఇద్దరూ రైటర్స్ గా ఉన్నారు. 2000 భర్త చనిపోయాడు. అప్పటి వరకు బెంగుళూరులో ఉన్న వహీదా ఆ తర్వాత ముంబయికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు అక్కడే ఉంటుంది.