బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు.. రెడీగా ఉండండి!
సినిమా విజయానికి ప్రామాణికం ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద చూపించే ప్రభావమే. టాలీవుడ్ సినిమాల సత్తా రోజు రోజుకు పెరుగుతోంది. బాలీవుడ్ చిత్రాలకు ధీటుగా తెలుగు చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. స్టార్ హీరోల సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు నెలకొల్పుతుంటే ఆ సందడే వేరు. అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న కొన్ని టాలీవుడ్ చిత్రాలు ఈ ఏడాది, వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యేందుకు సిద్ధం అవుతున్నాయి.
సాహో: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం 300 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. ఆగష్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. బాహుబలి 2 రికార్డులని సాహో బ్రేక్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.
సైరా నరసింహారెడ్డి : స్వాతంత్ర సమర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రం కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డియర్ కామ్రేడ్ : అర్జున్ రెడ్డి గీత గోవిందం చిత్రాలతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఇది. మరోసారి విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా రష్మిక నటిస్తోంది. ఈ చిత్రంతో కూడా విజయ్ దేవరకొండ మ్యాజిక్ చేస్తాడని అంతా భావిస్తున్నారు.
వెంకీ మామ : ఎఫ్ 2 చిత్రంతో విక్టరీ వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రం 80 కోట్లకుపైగా షేర్ రాబట్టింది. దీనితో వెంకీ కామెడీ పండిస్తే ఎలా ఉంటుందో మరోసారి రుజువైంది. ఎఫ్2 తర్వాత వెంకీ నటిస్తున్న మరో మల్టీస్టారర్ చిత్రం వెంకీ మామ. ఈ చిత్రంలో మరో హీరోగా నాగచైతన్య నటిస్తున్నాడు.
గ్యాంగ్ లీడర్ : నేచురల్ స్టార్ నాని, విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. జెర్సీ తర్వాత నాని గ్యాంగ్ లీడర్ తో మరో హిట్ అందుకుంటాడేమో చూడాలి.
వాల్మీకి : కెరీర్ ఆరంభం నుంచి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలపై ఆసక్తి చూపుతున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వాల్మీకి చిత్రంలో వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.
ఇష్మార్ట్ శంకర్ : పూరి జగన్నాథ్, హీరో రామ్ కాంబినేషన్ లో వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ఇది. ఈ చిత్రంలో తన సత్తా తిరిగి నిరూపించుకోవాలని పూరి భావిస్తున్నాడు. ఇటీవల పూరి జగన్నాథ్ కు సరైన హిట్ లేదు.
సరిలేరు నీకెవ్వరు :సూపర్ స్టార్ మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లోని ఈ చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దుతానని అనిల్ ప్రకటించేశాడు. దీనితో ఈ చిత్రంపై మహేష్ అభిమానుల్లో ఇప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. లేడి సూపర్ స్టార్ విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు.
అఖిల్ 4 :అఖిల్ నటించిన మూడు చిత్రాలు నిరాశపరిచాయి. దీనితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అఖిల్ తన నాల్గవ చిత్రాన్ని ప్రారంభించాడు.
AA19: అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ లది సూపర్ హిట్ కాంబినేషన్. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైంది. నా పేరు సూర్య పరాజయం తర్వాత బన్నీ నటిస్తున్న చిత్రం ఇది.
మన్మథుడు 2: నాగార్జున కెరీర్ లో మన్మథుడు చిత్రం ఓ మోమొరబుల్ మూవీ. నాగార్జునకు మహిళల్లో అభిమానులు ఈ చిత్రంతో మరింతగా పెరిగారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా మన్మథుడు 2 తెరకెక్కుతోంది.
RRR : దేశం మొత్తం సినిమా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న చిత్రం ఇది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్నారు. 400 కోట్ల భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎన్ని సంచనాలు సృష్టిస్తుందో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 2020 జులై 30న ఆర్ఆర్ఆర్ చిత్రం విడుదల కానుంది.